ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ నాలుగు నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ధరణి కమిటీ ఏర్పాటు, రెవెన్యూ సదస్సుల పేరుతో హడావుడి తప్ప సమస్యలు పరిష్కారం కాలేదన్నది రైతుల మాట. ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందంటూ మరో 3నెలలు పరిష్కారాన్ని వాయిదా వేసింది. మరోవైపు పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారానికి కోడ్ అడ్డంకి కాదని నిపుణులు చెప్తున్నారు.
Dharani | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రెవెన్యూశాఖలో దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం అనేది నిత్య ప్రక్రియ. ధరణి దాదాపు మూడేండ్లుగా కొనసాగుతూనే ఉన్నది కాబట్టి ఆపాల్సిన అవసరం లేదని అంటున్నారు. ధరణి కమిటీలోని కొందరు సభ్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేసినా ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే దరఖాస్తుల పరిష్కారాన్ని నిలిపివేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ధరణి పోర్టల్పై అధ్యయనానికి, పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో కమిటీ నియమించింది.
ఐదుగురు సభ్యుల కమిటీ వివిధ దశల్లో చర్చలు జరిపి ప్రభుత్వానికి తొలివిడతగా కొన్ని సూచనలు చేసింది. దీని ప్రకారం ప్రభుత్వం ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్చి 1వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. ధరణిలో వివిధ మాడ్యూళ్ల కింద మొత్తం 2,46,536 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని 9 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రకటించింది. తహసీల్దార్స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు కమిటీలు వేసి, వారికి పరిష్కార బాధ్యతలు అప్పగించింది.
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే పరిష్కరించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు గరిష్ఠంగా వారం రోజుల గడువు విధించింది. క్షేత్రస్థాయి పరిశీలనలు పూర్తయ్యాక తహసీల్దార్కు, ఆర్డీవోకు, కలెక్టర్కు నివేదికలు అందించడం, దరఖాస్తును డిస్పోజ్ చేయడం 9 రోజుల్లో సాధ్యం కాదని నిపుణులు అప్పుడే స్పష్టం చేశారు. అప్పట్లో మార్చి మొదటివారంలో ఎన్నికల కోడ్ వస్తుందనే ప్రచారం జరగడంతో తూతూమంత్రంగా నాలుగైదు రోజులు హడావుడి చేసి, కోడ్ను అడ్డం పెట్టుకొని నిలిపివేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు స్పెషల్ డ్రైవ్ నాటకం మొదలుపెట్టిందని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి తగ్గట్టే ప్రభుత్వం మొదటి 9 రోజుల్లో ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించలేదు.
ఎన్నికల కోడ్ రాకపోవడంతో స్పెషల్ డ్రైవ్ను మార్చి 17 వరకు పొడిగిస్తూ 11న ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం అంచనా వేసినట్టే కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కోడ్ను సాకుగా చూపి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్కు బ్రేకులు వేసింది. ఆధార్ సీడింగ్, అక్షర దోషాలు, పేర్లు తప్పుగా పడడం వంటి చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరించకుండా పక్కన పెట్టేయడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
భూ సమస్యలకు సంబంధించి హక్కుల్లో స్పష్టత లేని భూములను రెవెన్యూ అధికారులు పార్ట్-బి అని పిలుస్తుంటారు. మొదట్లో సుమారు 26 లక్షల ఎకరాల వరకు పార్ట్-బిలో ఉండేవని, ఇందులో 8 లక్షల ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. మిగతా 18 లక్షల ఎకరాలతోపాటు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పార్ట్-బిలోని భూముల సమస్యల పరిష్కారానికి వివిధ దశల్లో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
అత్యధిక శాతం తుది దశ అనుమతుల వద్దే నిలిచిపోయినట్టు సమాచారం. ప్రభుత్వం తలచుకుంటే గత నాలుగు నెలల్లో పార్ట్-బిలోని లక్షలాది ఎకరాలకు మోక్షం కల్పించి ఉండేదని అధికారులు చెప్తున్నారు. ఇవన్నీ పరిష్కారం అయితే దాదాపు 10 లక్షల ఖాతాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా. అదే జరిగితే రైతుబీమా, రైతు భరోసా వంటి పథకాలపై అధిక భారం పడుతుందని, కొన్ని నెలలు పక్కన పెట్టాలని ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది.