హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): గోదావరి, కృష్ణా రివర్ బోర్డుల అధికార పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గత జూలైలో జారీచేసిన గెజిట్ రాజ్యాంగ విరుద్ధమని, దానిని వెంటనే రద్దుచేయాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) డిమాండ్ చేసింది. టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. గెజిట్ వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని నొక్కి చెప్పారు. ఇదే విషయమై రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్కు లేఖ రాసినట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమ ప్రధాన డిమాండ్లలో నీళ్లు కూడా ఒకటని గుర్తుచేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర విభజన తరువాత కూడా న్యాయమైన హక్కుల కోసం తెలంగాణ పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని 12 జిల్లాల్లో ఉన్న దాదాపు 1.80 కోట్ల ప్రజల తాగు, సాగునీటి అవసరాలను కృష్ణా జలాలు తీర్చాల్సి ఉన్నదని వివరించారు. అందులో భాగంగా చేపట్టిన తొమ్మిది ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, అవి పూర్తయితే 36.53 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 7.53 లక్షల ఎకరాలు అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటికే రూ.వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్తో అవన్నీ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నదీ జలాల పంపిణీ అధికారం కేవలం ట్రిబ్యునళ్లకే ఉన్నదని చెప్పారు. రివర్బోర్డుల అవసరమే లేదని, ఇరు రాష్ర్టాలపై ఆర్థికభారాన్ని మోపడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టంచేశారు. కేంద్రం ఇప్పటికైనా ముందుగా కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన నీటి వాటాను నిర్ణయించాలని కోరారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా ముందుకొచ్చి, గెజిట్ నోటిఫికేషన్ను ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. టీడీఎఫ్ అధ్యక్షుడు వట్టె రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్, సీనియర్ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, కే శ్రీనివాస్, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాదరెడ్డి, టీడీఎఫ్ ఇండియన్ చైర్మన్ రణధీర్రెడ్డి, టీడీఎఫ్ యూఎస్ఏ ఎక్స్ చైర్మన్ రామ్, అనుగు లక్ష్మణ్, కెప్టెన్ పాండురంగారెడ్డి, విశ్రాంత చీఫ్ ఇంజినీర్లు చంద్రమౌళి, సాంబయ్య, ఖగేందర్ తదితరులు పాల్గొన్నారు.