హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : నల్లమల అడవుల్లో ఆపరేషన్ మదర్ టైగర్ విఫలమైంది. రాత్రంతా తల్లి పులి కోసం అటవీ సిబ్బంది వేచి చూసినా ఫలితం దక్కలేదు. తల్లి పులి రాకపోవడంతో నాలుగు పులి పిల్లలను ఆత్మకూరుకు అటవీశాఖ సిబ్బంది తరలించారు. అయితే, తల్లి పులి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతున్నది. ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురంలో నాలుగు పులి పిల్లలు కనిపించడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద గుమ్మాడాపురానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు.
పెద్దగుమ్మాడాపురానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని ముసలిమడుగు గ్రామ సమీపంలో సంగమేశ్వరం వెళ్లే బీటీ రహదారిపైకి పులి వస్తుండగా చూసినట్టు ఓ గొర్రెల కాపరి, పండ్ల వ్యాపారి తెలిపారు. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పులి అడుగు జాడల ద్వారా దాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగు పులి పిల్లలకు మూడు రోజులుగా పాలు, సెరెలాక్, చికెన్, లివర్ ముక్కలు అందిస్తున్నారు.