హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాల్లో ఏనుగుల లెక్క తేల్చేందుకు ఆయా రాష్ర్టాల అటవీ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 17 నుంచి 3 రోజుల పాటు ఏనుగుల గణన చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం, శ్రీవేంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం అటవీ ప్రాంతాల్లో ఈ లెక్కింపు చేపట్టనున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు.
దక్షిణ భారతదేశంలో తెలంగాణ మినహా కర్ణాటక, ఏపీ, తమిళనాడు, గోవా, మహారాష్ట్రలోని కొంత ప్రాంతంలో ఒకేసారి ఈ నెల 17, 18, 19 తేదీల్లో లెక్కింపు చేపట్టనున్నారు. ఏనుగుల గణనకు కర్ణాటక అటవీశాఖ రూపొందించిన మాడల్ను అనుసరిస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాలతో కలిసి ఒకేసారి ఏనుగుల లెక్కింపును ప్రణాళికబద్ధంగా చేపడుతున్నామని ఏపీ సీసీఎఫ్(వైల్డ్లైఫ్) శాంతిప్రియ తెలిపారు. ఇందుకోసం పక్కా ప్రణిళికను సిద్ధం చేశామని చెప్పారు. మూడు విధాలుగా లెక్కింపు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.