కాళేశ్వరం/కోటపల్లి, ఏప్రిల్ 15: ప్రాణహితలో పుష్కర స్నానం చేసేందుకు భక్తజనం పోటెత్తుతున్నది. మూడో రోజు శుక్రవారం లక్ష మంది ఆయా పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం పెద్దలకు పిండప్రదానం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి కుటుంబ సభ్యులతో కలిసి స్నానమాచరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో పుణ్య స్నానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. త్రివేణి సంగమం దాటి ప్రాణహిత నదిలో పుష్కర స్నానాలు చేసి, సైకత లింగాలను పూజించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద గుండెపోటుతో నదిలో పడి ఏపీలోని విశాఖపట్నం ఎన్ఏడీ కాలనీకి చెందిన గుడ్ల సోమేశ్వర్రావు మృతిచెందాడు.