హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి పేపర్ లీకేజీల భయం పట్టుకున్నది. దీంతో ఇప్పటి నుంచే అధికారులను అప్రమత్తం చేస్తున్నది. ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది. ఇటీవల విద్యాశాఖపై సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులకు గట్టి హెచ్చరికలు జారీచేసినట్టు తెలిసింది. 2019లో ఇంటర్ ఫలితాలు తారుమారు కావడం.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని సీఎం ఆ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలిసింది. దీంతోపాటు 2022లో పదో తరగతి పేపర్ లీక్ కావడాన్ని సైతం గుర్తుచేసిన సీఎం ఈసారి ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షల్లో అలాంటి తప్పిదాలకు ఆస్కారం ఉండరాదని హెచ్చరించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పదోతరగతి పేపర్ లీకులతో చాలా బద్నాం కావాల్సి ఉంటుందని.. గతంలో ఇదే జరిగిందని మొత్తంగా పరీక్షలను సవ్యంగా నిర్వహించాలని ఆదేశించినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్, మార్చి 18 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇంటర్కు 9 లక్షలకు పైగా, పదోతరగతి పరీక్షలకు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తంగా ఈ పరీక్షలను సజావుగా నిర్వహించకుంటే అప్రతిష్టను మూటగట్టుకుంటామన్న ఆందోళన ప్రభుత్వంలో కనిపిస్తున్నది.