BRS | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట /గజ్వేల్/గజ్వేల్ అర్బన్/మెదక్/మెదక్ అర్బన్/సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మైనంపల్లి వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. పలుచోట్ల మైనంపల్లి దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. మంత్రి హరీశ్రావుపై అడ్డగోలుగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. నాలుక చీరేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు సాయన్నగారి సుందర్, సద్ది నాగరాజు రెడ్డి, కెమ్మసారం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో సోమవారం మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం దమ్ముంటే సిద్దిపేటకు వచ్చి చూడు.. మేము ఏందో చూపిస్తాం అని హెచ్చరించారు. తెలంగాణ కోసం పదవులను తృణ ప్రాయంగా వదిలేసిన చరిత్ర హరీశ్రావుదని పేర్కొన్నారు. ఇక ముందు ఇలాంటి విమర్శలు చేస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులు పోశంగారి సత్తిరెడ్డి, బొంగు రాజేందర్రెడ్డి, మాడూరి కిట్టు, లిఖిత్, వీరుగౌడ్,భాసర్, మల్లారెడ్డి, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో..
సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో కౌన్సిలర్ అలకుంట కవిత, బీఆర్ఎస్ నేత మహేందర్ ఆధ్వర్యంలో వడ్డెర కుల సంఘం, మహిళలు, పార్టీ కార్యకర్తలు మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీ మైనార్టీశాఖ జిల్లా అధ్యక్షుడు పక్రోద్దీన్, మాజీ కౌన్సిలర్ జావెద్ ఆధ్వర్యంలో పార్టీ మైనార్టీ శ్రేణులు మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం చేశారు.
మైనంపల్లి గ్రామాల్లో ఎలా తిరుగుతాడో చూస్తాం
మెదక్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక కొత్త బస్టాండ్ వరకు మైనంపల్లి శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి మాట్లాడుతూ… స్వార్థం కోసం మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యే స్థానాన్ని ఆశిస్తున్నారని ఆరోపించారు. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి గ్రామాల్లో ఎలా తిరుగుతాడో చూస్తామని హెచ్చరించారు. ఆందోళనలో నాయకులు మల్లికార్జున్గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు సతీశ్, నవీన్, రంజిత్ నాయకులు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుండు కొట్టి సున్నం బొట్టు పెడతాం: తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం
మంత్రి హరీశ్రావును విమర్శిస్తే సహించేది లేదని మైనంపల్లి హన్మంతరావును తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం హెచ్చరించింది. నోరు ఆదుపులో పెట్టుకోవాలని, లేదంటే గుండు కొట్టి సున్నం బొట్టు పెడతామని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హరీశ్రావుకు, మైనంపల్లికి నకకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉన్నదని తెలిపారు. హరీశ్రావు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయన పైన పోటీచేసిన వారి డిపాజిట్లు గల్లంతయ్యాయని గుర్తు చేశారు. మంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి సిద్దిపేట తెలంగాణ రాష్ట్రానికి రోల్ మాడల్గా నిలిచిందని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలే తన కుటుంబంగా, ప్రజల బాగోగులే తన శ్రేయస్సుగా రాత్రింబవళ్లుగా కృషి చేస్తున్న హరీశ్రావు విమర్శించడం సిగ్గుచేటని, ఇది మైనంపల్లి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం తగదు : బీఆర్ఎస్వీ
మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలు సరికావని బీఆర్ఎస్వీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మేర్గు మహేశ్ అన్నారు. సిద్దిపేటలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్వీ నేతలు రాచకొండ భిక్షపతి, పయ్యావుల శ్యాం యాదవ్తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. హరీశ్రావు లాంటి నాయకునిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు గోవిందరా రవి, గుజ్జ రాజు, బండి శ్రీకాంత్, దబ్బెట మహేశ్ ,పలువురు నాయకులు పాల్గొన్నారు.
మైనంపల్లికి పుట్టగతులుండవ్ : ముదిరాజ్ మహాసభ
మంత్రి హరీశ్రావుపై మైనంపల్లి వ్యాఖల్యను ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి ఖండించారు. హరీశ్రావును నిందిస్తే మైనంపల్లికి పుట్టగతులు ఉండవని, వెంటనే క్షమాపణ చెప్పాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పనిచేస్తున్న మంత్రి హరీశ్రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు శోచనీయమని గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. మైనంపల్లి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని భేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టే తీరు మైనంపల్లిది
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలపై మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, హెచ్డీసీ చైర్మన్ చింతాప్రభాకర్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావు, భూపాల్రెడ్డి మైనపల్లి హన్మంతరావు వ్యాఖ్యలను ఖండించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు రాజకీయంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న మైనంపల్లికి రాజకీయంగా పునర్జన్మనిచ్చింది సీఎం కేసీఆర్ అని, అవన్నీ మరిచి అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టిన విధంగా వ్యవహరించడం తగదని సూచించారు. సభ్యత లేని మనిషిగా వ్యవహరిస్తున్న మైనంపల్లిపై పార్టీ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హరీశ్రావుకు అండగా ఉంటాం: కేటీఆర్
మంత్రి హరీశ్రావుకు తామందరం అండగా ఉంటామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హరీశ్రావు బీఆర్ఎస్ ప్రారంభమైనప్పటి నుంచి పార్టీ వెన్నంటే ఉన్న వ్యవస్థాపక సభ్యుడని అన్నారు. ఆయన పార్టీకి ముఖ్యమైన మూలస్తంభాల్లో ఒకరుగా కొనసాగుతారని సోమవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. తన కుమారుడికి టికెట్టు దక్కని కారణంగా మంత్రి హరీశ్రావుపై పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. ఎమ్మెల్యే ప్రవర్తనను తీవ్రంగా ఆక్షేపించారు.
నిబద్ధత, సేవ అనిర్వచనీయం: కవిత
తెలంగాణ సీనియర్ నేత, ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నిబద్ధత, బీఆర్ఎస్ పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమైనవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హరీశ్రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు తగవని అన్నారు. ఆయన వ్యాఖ్యలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు సోమవారం కవిత ట్వీట్ చేశారు.
కామన్ సెన్స్ ఉండాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా మైనంపల్లి హనుమంతరావు పార్టీలో అం తర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా మాట్లాడటం తగదు. ఒక నాయకుడికి ముఖ్యం గా ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తికి ఆ కామన్ సెన్స్ ఉండాలి. మైనంపల్లి స్థాయికి అటువంటి దురుసు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. మైనంపల్లి వ్యక్తిగత విచక్షణ కోల్పోయి ఏదో మాట్లాడినట్టు ఉన్నారు. ఆయన బెదిరింపు మాటలు బీఆర్ఎస్లో చెల్లవు. మైనంపల్లి వ్యా ఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న. వ్యాఖ్యలను మైనంపల్లి వెంటనే వెనకి తీసుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
-తక్కళ్లపల్లి రవీందర్రావు , ఎమ్మెల్సీ
నోరు అదుపులో పెట్టుకో
పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉండి మంత్రి హరీశ్రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు గర్హనీయం. మైనంపల్లి నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మైనంపల్లి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. క్షమాపణ చెప్పాలి. హరీశ్రావు చేసిన ప్రజాసేవలో మైనంపల్లిది పైసా వంతు కూడా లేదు. మైనంపల్లికి రాజకీయ పునర్జన్మనిచ్చిన బీఆర్ఎస్పై, పార్టీ నేతలపై అవాకులు, చవాకులు పేలితే సహించం.
– ఏ వెంకటేశ్వరెడ్డి, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ మాజీ చైర్మన్