మహబూబ్నగర్/టౌన్/మెట్టుగడ్డ/అర్బన్, ఆగస్టు 13: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్బండ్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకున్నది. జిల్లా స్థాయిలో అద్భుతంగా నిర్వహించిన ఈ ప్రదర్శనను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘మాది మహబూబ్నగర్’ అని చెప్పుకునేలా సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పాలమూరును అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. మినీ ట్యాంక్బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్డు, మధ్యలో ఐలాండ్, సస్పెనన్ బ్రిడ్జి, పక్కన శిల్పారామంతో ఎంతో సుందరంగా మారనున్నదని తెలిపారు.
ఐటీ టవర్ ద్వారా వేలాది మంది స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. కాగా.. 450 డ్రోన్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ట్యాంక్బండ్ నలుదిక్కులా జనంతో కిక్కిరిసిపోయింది. తెలంగాణ, మహబూబ్నగర్ మ్యాప్, కోహినూర్ వజ్రం, కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, పిల్లలమర్రి, సస్పెషన్ బ్రిడ్జి, మినీ శిల్పారామం, ఐటీ టవర్, జోగుళాంబ ఆలయం, సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖచిత్రాలు, జై భారత్, జై తెలంగాణ, చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, పర్యాటక శాఖ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.