ముంబై, జనవరి29 (నమస్తే తెలంగాణ): నూతన సాంకేతిక పద్ధతులు పాటించి చీడపీడలను తట్టుకునే నూతన వంగడాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నదని ఇక్రిశాట్ గ్లోబల్ రీసెర్చ్ పోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ షాన్మేస్, పీజేటీఎస్ఏయూ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పీ రఘురామిరెడ్డి చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నూతన వంగడాల రూపకల్పనపై రెండువారాల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
భవిష్యత్తులో బయో టెక్నాలజీకి చాలా డిమాండ్ ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. పత్తిలో గులాబీ రంగు పురుగును తట్టుకునే బీటీ పత్తి, వరిలో అగ్గి తెగులు, బాక్టీరియా ఆకుమచ్చ తెగులు, ఉల్లికోడును తట్టుకునే రకాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరాన్ని పీజేటీఎస్ఏ, టీఎస్ కాప్ట్ సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమంలో ఐబీటీ డైరెక్టర్ డాక్టర్ సీవీ సమీర్కుమార్, పాలెం ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ మల్లారెడ్డి, ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మనీశ్పాండే, ఐబీటీ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ అనురాధ, వివిధ వ్యవసాయ, ఉద్యానవన వర్సిటీల నుంచి 40 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ శాస్త్రవేత్తలకు ఫిబ్రవరి 10 వరకు బయో టెక్నాలజీపై పూర్తిగా శిక్షణ ఇస్తారు.