Lakshmi Baraj | జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): లక్ష్మీ బరాజ్ వద్ద జరిగిన సంఘటనపై మేడిగడ్డ ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు శనివారం రాత్రి వివరణ ఇచ్చారు. ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్పై శనివారం సాయంత్రం సమయంలో పేలుడు వంటి శబ్దం వచ్చింది. అక్కడే ఉన్న మా కంట్రోల్రూం సిబ్బంది అప్రమత్తమయ్యారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు. శబ్దం వచ్చిన అనంతరం తమ సిబ్బంది అప్రమత్తమై ఏం జరిగిందో తెలుసుకుంటున్నారని చెప్పారు. బ్రిడ్జిపై నిత్యం పనులు జరుగుతున్నాయని, రాత్రి కాగానే ఎల్ అండ్ టీ, ఇరిగేషన్ వారు పనులు ముగించుకొని వెళ్లిపోయారని, బ్రిడ్జిపై రాకపోకలు సైతం తగ్గిపోయాయని తెలిపారు. అదే సమయంలో బరాజ్పై పెద్ద శబ్దం వచ్చినట్టు తెలిపారు.
మహారాష్ట్ర వైపు నుంచి 300 మీటర్ల దూరంలో 20వ పిల్లర్ వద్ద ఈ శబ్దం వచ్చినట్టు తెలుస్తున్నదని, దూరంగా వెళ్లి పరిశీలిస్తే 20వ పిల్లర్ వద్ద బ్రిడ్జి కొంత సింక్ అయి కనిపిస్తున్నదని చెప్పారు. బరాజ్పై నుంచి ఎక్కువగా మహారాష్ట్ర, తెలంగాణ కూలీలే అధికంగా వెళ్తూ ఉంటారని తెలిపారు. 20వ పిల్లర్ వద్ద దూరంగా పరిశీలిస్తే పెద్దగా డ్యామేజీ కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అక్కడే పోలీసు క్యాంపు కూడా ఉన్నదని, పోలీసు విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పారు. నిరుడు రికార్డుస్థాయిలో వరదలు వచ్చాయని, బరాజ్ డిజైన్ చేసినదానికంటే ఎక్కువ వరదలు వచ్చినప్పటికీ బరాజ్కు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. వందేండ్ల డాటా తీసుకొని బరాజ్కు డిజైన్ చేసినట్టు వివరించారు. కాళేశ్వరంలో 1986 ఆగస్టు 15న అత్యధికంగా వరదలు వచ్చాయని, నిరుడు ఆ వరదలను దాటి 1.02 మీటర్ల వరద నీరు పైకి వచ్చిందని చెప్పారు. అయినా నీరు సేఫ్గా వెళ్లిపోయిందని వెల్లడించారు. ఇప్పటికీ బ్రిడ్జి పనులు ఎల్అండ్టీ ఆధీనంలోనే ఉన్నాయని, ఐదేండ్లు మెయింటెనెన్స్ వారి బాధ్యత అని, ఇంకా డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పోలీసు విచారణలో పూర్తిస్థాయి వివరాలు తెలుస్తాయని స్పష్టం చేశారు.