ములుగు : మన ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చుస్తామో.. మేడారం జాతరకు వచ్చే భక్తులను అలాగే చూడాలి. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
2022 ఫిబ్రవరి మాసంలో జరిగే మేడారం మహా జాతర సందర్భంగా తాడ్వాయి మండలం మేడారంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మేడారం జాతర పనులను ముమ్మరం చేయాలి. ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలి. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గతంలో వచ్చిన ఇబ్బందులను బేరీజు వేసుకుని, వాటిని ఈసారి అధిగమించేలా ప్రయత్నించాలన్నారు.
తాగునీటి, పారిశుద్ధ్యం, వసతి, ఇతర సొకర్యాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య భక్తుల క్యూ లైన్లు, భారీకేడ్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ లు వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి. స్నాన ఘట్టాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలి.
రహదారుకిరువైపులా ఆర్ అండ్ బీ అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు
భక్తుల రధ్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు, పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసు ప్రత్యేక కంట్రోల్రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని సూచించారు.
జాతర అనంతరం చెత్త తొలగింపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 15 లోగా పనులు పూర్తి అయ్యేలా ఆధికారులు పని చేయాలన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మేడారంలో రూ. 10 కోట్లతో సూట్ రూమ్స్, డార్మిటరి, క్యాంటీన్, ఇతర సౌకర్యాలతో వసతి గృహాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి నివేదిక సమర్పించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు మేడారం జాతర ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ప్రాజప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.