కౌడిపల్లి, మార్చి 19: అమ్మానాన్న పొలానికెళ్లారు.. కవలలైన ఆ అక్కాచెల్లెళ్లు సంగీత, సీత రేకుల షెడ్డుకు ఉయ్యాల కట్టుకొని ఆడుకుంటున్నారు.. అప్పుడే రాకాసి గాలిదుమారం సుడిగాలిలా విరుచుకుపడింది. గద్ద వచ్చి కోడిపిల్లను ఎత్తుకుపోయినట్టు ఆ సుడిగాలి ఉయ్యాలలో ఉన్న చిన్నారి సంగీతను రేకులషెడ్డుతోసహా విసిరికొట్టింది. ఆ వేగానికి రెండు ఇండ్ల అవతల ఓ స్లాబ్పై పడ్డ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాలో చోటు చేసుకున్నది. చిన్నారి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. జాజితండాకు చెందిన మంజుల, మాన్సింగ్ దంపతులకు సంగీత, సీత అనే కవలలు ఉన్నారు. అదే తండాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సంగీత (6) ఒకటో తరగతి చదువుతున్నది.
సోమవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. నానమ్మతో ఉన్న సంగీత, సీత ఇంట్లో రేకులకు ఉయ్యాల కట్టుకుని ఆడారు. కొద్దిసేపటికి నానమ్మ, సీత ఇద్దరూ పక్కింట్లోకి వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే భారీగా సుడిగాలి వీచింది. రేకులతోపాటు చిన్నారి సంగీత ఎగిరిపోయి రెండు ఇండ్ల తర్వాత ఉన్న స్లాబ్పై పడింది. గమనించిన ఇరుగుపొరుగు వారు గాయాలతో కొట్టుమిట్టాడుతున్న సంగీతను 108లో నర్సాపూర్ దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం చిన్నారి సంగీత మరణించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి మంగళవారం పరామర్శించారు.
సిద్దిపేట, మార్చి 19: బలమైన ఈదురుగాలులకు చెట్టుకొమ్మ విరిగిపడి టెన్త్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొల్గూర్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన మన్నె రేణుక చంద్రయ్య దంపతుల రెండో కుమారుడు వెంకటేశ్ మండలంలోని అహ్మదీపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పదో తరగతి హిందీ పరీక్ష రాసి ఇంటికొచ్చాడు. సాయంత్రం పొలం వద్ద ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన వెంకటేశ్ పశువులను తోలుకుంటూ ఇంటి కొస్తున్న సమయంలో ఈదురుగాలుల వానకు రోడ్డు వెంట ఉన్న చెట్టుకొమ్మ విరిగి వెంకటేశ్ మీద పడింది. ఒక్కసారిగా అతడు సీసీరోడ్డుపై పడి ప్రాణాలు వదిలాడు. తల్లిదండ్రులు తన అన్నతో కలిసి పొలం నుంచి బైక్పై ఇంటికొచ్చారు. వారి వెనకాలనే పశువులను తొలుకుంటూ ఇంటికి మరో ఐదు నిమిషాల్లో చేరుతాడనుకొనేలోపే వెంకటేశ్ చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.