ఖైరతాబాద్, ఏప్రిల్ 30: ‘న్యాయస్థానం ఆదేశాల మేరకు వెంటనే రాష్ట్రంలోని సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే పాత పాలకవర్గాలనైనా కొనసాగించాలి. లేని పక్షంలో ఈ వ్యవహారంపై మళ్లీ న్యాయపరమైన పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం’ అని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఇతర సహకార సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు తదితరులు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం దివంగత వైఎస్సార్ హయాంలో ప్రొఫెషనల్ బ్యాంకర్లకు సహకార వ్యవస్థలో అవకాశం కల్పించారని రవీందర్రావు గుర్తుచేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సహకార వ్యవస్థ బలోపేతానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది సభ్యులతో రూ.60 వేల కోట్ల వ్యాపారం సహకార వ్య వస్థ ద్వారా నడుస్తున్నదని, ఈ సంఘాల్లో రాజకీయ ప్రమేయం తక్కువగా ఉండి ప్రధానంగా రైతులే సభ్యులుగా ఉన్నారని తెలిపారు. జీవో నంబర్ 597 ద్వారా ఎన్నికైన పాలకవర్గాల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 330 సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించగా, గత పాలకవర్గాలను తిరిగి కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చిందని చెప్పారు.
నాలుగు నెలలుగా కోర్టు తీర్పును అమలు చేయకుండా ప్ర భుత్వం నిర్లక్ష్యం చేయడమంటే రాజ్యాంగబద్ధ వ్యవస్థపై గౌరవం లేకపోవడమేనని మండిపడ్డారు. మొత్తం వ్యవస్థను రద్దు చేసి నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. సంఘాల సభ్యులు రైతులకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సహకార సంఘాల ప్రతినిధులు అశోక్, మంజులారెడ్డి, వెంకట్రెడ్డి, చంద్రశేఖర్, రాజేందర్, పాండుయాదవ్ పాల్గొన్నారు.