హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): దేశమంతా తెలంగాణ పథకాలు అమలు కావాలని రైతులు కోరుతున్నారని, సీఎం కేసీఆర్ ఆలోచనలు దేశానికి అత్యవసరం అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. కేంద్రంలోని పాలకులకు సీఎం కేసీఆర్ సంధించిన ప్రశ్నలపై సమాజంలో చర్చ మొదలైందని చెప్పారు. ఉచితం అంటే అనుచితంగా మాట్లాడుతున్నారని, అన్నం పెట్టే రైతులను చులకనగా చూస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
10వ విడత రైతుబంధు నిధులు.. 6వ రోజు మంగళవారం 5 ఎకరాలపైన ఉన్న 1,49,970 మంది రైతుల ఖాతాల్లో రూ.262.60 కోట్లు జమ అయినట్టు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 51,66,958 మంది రైతులకు రూ.3,767.35 కోట్లు అందజేసినట్టు మంత్రి పేర్కొన్నారు. కేంద్రం రూపాయి సాయం చేయకున్నా..కరెంటు, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. దేశమంతా ఈ పథకాలు అమలైతే భారత్ వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.