హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మునుగోడు తర్వాత నియోజకవర్గంలో పెద్దదైన చండూరు మండల ఎంపీపీ పల్లె కల్యాణి, ఆమె భర్త కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ప్రముఖ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ నేత పల్లె రవికుమార్గౌడ్ కూడా గులాబీ కండువా కొప్పుకొన్నారు. శనివారం పల్లె రవి, కల్యాణి దంపతులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉద్యమ కాలం నుంచి తమతో పనిచేసిన పల్లె రవికుమార్ మళ్లీ టీఆర్ఎస్ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.
కీలకమైన మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకొచ్చిన పల్లె రవికుమార్కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పాత మిత్రుడైన పల్లె రవికుమార్కు భవిష్యత్తులో ఖచ్చితంగా మరిన్ని మంచి అవకాశాలను కల్పిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తాము ఎలాంటి షరతులు లేకుండా టీఆర్ఎస్లో చేరామని పల్లె రవి కుమార్ తెలిపారు. చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటుచేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్కి తెలిపామన్నారు. కేటీఆర్ ఇందుకు సానుకూలంగా స్పందించారని రవి కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్, మర్రి రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే బీజేపీలో చేరి ఉప ఎన్నికను తీసుకురాగా.. నియోజకవర్గంలోని పెద్ద నేతలు మునిగిపోయే ఓడ నుంచి బయటపడుతున్నారు. వీరంతా రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్న టీఆర్ఎస్లో చేరడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు స్థానిక నేతలు గులాబీ కండువా కప్పుకోగా.. తాజాగా చండూరు ఎంపీపీ పల్లె కల్యాణి, రవి దంపతులు టీఆర్ఎస్లో చేరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని గుర్తించిన ప్రతిపక్షాలు నీరుగారిపోతున్నాయి. ఆయా పార్టీల ముఖ్యనాయకులు టీఆర్ఎస్లో చేరడానికి ముందుకొస్తున్నారు. ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నందున తాము కూడా ప్రజలున్న వైపే ఉండాలని గులాబీ కండువా కప్పుకోవడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు సర్పంచ్లు, వివిధస్థాయి ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు అనేక కుల సంఘాలు, వివిధ సామాజిక, వృత్తి సంఘాలు కూడా టీఆర్ఎస్కు స్వచ్ఛందగా మద్దతు ప్రకటిస్తున్నాయి.