CJI Chandrachud | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : అత్యున్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు తనను కలిచివేస్తున్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఐఐటీ బాంబే దళిత విద్యార్థి ఉదంతంతోపాటు నిరుడు ఒడిశా నేషనల్లా యూనివర్సిటీకి చెందిన ఆదివాసీ విద్యార్థి ఆత్మహత్యను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటిని చూస్తుంటే మన విద్యాసంస్థల్లో ఎక్కడో ఏదో తప్పు జరుగుతున్నట్టు అర్థమవుతున్నదని చెప్పారు. విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతూ తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని బాధపడ్డారు.
ఐఐటీ బాంబేలో మొదటి సంవత్సరం చదువుతున్న గుజరాత్కు చెందిన విద్యార్థి దర్శన్ సోలంకి ఫిబ్రవరి 12న ఆత్మహత్య చేసుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఆత్మహత్యకు పాల్పడుతున్న వారంతా అణగారిన వర్గాలకు చెందిన వారేనని వెల్లడించారు. ఇవన్నీ కేవలం అంకెలు,గణాంకాలకు సంబంధించినవి కావని, కొన్ని శతాబ్దాల పోరాట గాథలని గుర్తు చేశారు. సమస్య ఎక్కడుందో గుర్తించడమే మొదట చేయాల్సిన పని అని, ఇది తన నమ్మిక కూడా అని చెప్పారు. నల్సార్ లా యూనివర్సిటీ రజతోత్సవంతోపాటు స్నాతకోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. మన దేశానికి చెందని ప్రముఖ విద్యావేత్త సుఖ్దేవ్ తోరట్ ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థులంతా ఆదివాసీ, దళిత వర్గాలకు చెందిన వారేనని దీన్ని కచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరముందని చెప్పారు.
వీటిని అంతం చేయాలంటే సానుభూతి, కరుణ, దయతో కూడిన విద్యాబోధన అవసరమని, అందుకు విద్యాసంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు. 75 ఏండ్ల స్వాతంత్య్రంలో మనం ప్రముఖ సంస్థలను సృష్టించడంపైనే దృష్టి పెట్టాం కానీ.. సహృదయ సంస్థల ఏర్పాటు గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి హోదాలో నేను ఈ విషయాలను మాట్లాడటంపై కొందరు ఆశ్చర్యపోవచ్చు. కానీ, మన విద్యా సంస్థల్లో సానుభూతి కొరవడటానికి వివక్షకు నేరుగా సంబంధముందని అనుకుంటున్నా అని సీజే వివరించారు. స్నేహభావం ఉంటే వివక్ష అనేది ఉండదని చెప్తూ వస్త్రధారణ, గ్రామీణ నేపథ్యంలోని అలవాట్లను ఎగతాళి చేయడం వంటివి రూపుమాపాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు దయ, ప్రేమతో వ్యవహరించేలా తీర్చిదిద్దాలన్నారు. ఇదే తరహాలో న్యాయమూర్తులు కూడా పని చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద ఘటనలకు సంబంధించిన కేసుల్లో సాంకేతిక కోణంలో ఉత్తర్వు జారీ కంటే, ఆయా కేసుల్లోని పరిస్థితులను బట్టి సానుభూతి, దయతో న్యాయమూర్తులు స్పందించి ఉత్తర్వులు జారీ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని వెల్లడించారు. తాను న్యాయవాదుల మానసిక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యమిస్తానో, విద్యార్థలు మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యమిస్తానని చెప్పారు. విద్యార్థుల్లో కరుణభావం కలిగేలా పాఠ్యాంశాలుండాలని సూచించారు. విద్యార్థుల పట్ల అధ్యాపకులు కూడా సున్నితంగా వ్యవహరించాలని కోరారు. సానుభూతిని ప్రోత్సహించడం విద్యాసంస్థల మొదటి కర్తవ్యం అవ్వాలని ఆకాంక్షించారు.
ప్రధాన న్యాయమూర్తి హోదాలో నేను ఈ విషయాలు మాట్లాడటంపై కొందరు ఆశ్చర్యపోవచ్చు. కానీ, మన విద్యా సంస్థల్లో సానుభూతి కొరవడటానికి వివక్షకు నేరుగా సంబంధమున్నదని భావిస్తున్నా.
-సీజేఐ చంద్రచూడ్
చదువులోనే కాకుండా అన్నింటిలోనూ పోటీ ఉండాలని, ప్రధానం కారాదని, అది మానవీయతతో పెనవేసుకుని ఉండాలని సీజేఐ వివరించారు. చదువులు పూర్తయి ఎకడికి వెళ్లినా విద్యాబోధన చేసిన అధ్యాపకులనే కాకుండా సంస్థలోని కార్మికులు, సిబ్బంది సేవలను కూడా గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చారు. అకడమిక్ అంశాలతో పాటు సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అలవర్చుకోవాలని చెప్పారు. సృజనాత్మకత మన వృత్తిలో ఎంతో కీలకంగా ఉపయోగపడుతుందని చెప్తూ, అమెరికా సుప్రీంకోర్టు సె్పైడర్ మ్యాన్ సినిమాలోని ఒక లైన్ను తీర్పులో ఉటంకించిందని గుర్తు చేశారు. కార్యక్రమానికి నల్సార్ వర్సిటీ చాన్సలర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షత వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ పీఎస్ నర్సింహ, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రీ, జస్టిస్ పీవీ రెడ్డి, భారత బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, నల్సార్ వ్యవస్థాపక వీసీ ప్రొఫెసర్ రణబీర్ సింగ్ హాజరయ్యారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు స్వాగతం పలుకగా, రిజిస్ట్రార్ కే విద్యుల్లతారెడ్డి వందన సమర్పణ చేశారు. అంతకుముందు జస్టిస్ చంద్రచూడ్ మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. వర్సిటీ విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఆహ్లాదకరంగా స్నాతకోత్సవం జరిగింది. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.
శ్రీశైల భ్రమరాంబమల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ వై చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనాదాస్ శనివారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. స్వామి, అమ్మవార్ల ధూళి దర్శనం చేసుకున్నారు. పరివార దేవతాలయాలను దర్శించుకొని మల్లికాగుండంలో ప్రతిబింబించే విమాన గోపురాన్ని నమస్కరించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి శ్రీచక్ర కుంకుమార్చన నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.