వరంగల్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతిఒక్కరూ బాల్యాన్ని పూర్తిగా అనుభవించేలా చిన్నారులకు రక్షణ కల్పించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. లైంగికదాడుల బాధితులకు న్యాయం అందించడంతోపాటు వారిని మానసికంగా పూర్వ స్థితికి తీసుకురావడం చాలా ముఖ్యమని అన్నారు. సమాజంలో నైతికతకు, చట్టానికి మధ్య అం తరం నిరంతరం కొనసాగుతున్నదని చెప్పా రు. చట్టం ప్రకారం ఆడ, మగ సమానమని, సమాజంలోనూ, నైతికంగా ఇలాంటి పరిస్థితి ఉండాలని అన్నారు.
వరంగల్-హనుమకొండ జిల్లాల కోర్టు భవనాన్ని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆదివారం సందర్శించారు. ఆధునీకరించిన పోక్సో కోర్టును పరిశీలించారు. అనంతరం జ్యుడీషియరీ ప్రోగ్రాంలో ఆయన మా ట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన కోసం చట్టాలు తెచ్చి అమలు చేస్తున్నా అవి ఇంకా కొనసాగుతున్నాయన్నారు. లైంగికదాడులకు గురైన బాధితులు గతంలో బయటికి చెప్పుకొనేవారు కాదని, ఇప్పుడు న్యాయం కోసం వస్తున్నారని చెప్పారు. పోక్సో చట్టం కేసులలో బాధితుల పేర్లను వెల్లడించవద్దని అందరికీ సూచించారు. వరంగల్లో పోక్సో ప్రత్యేక కోర్టు నిర్మాణం అభినందనీయమని, అన్ని జిల్లాల్లోనూ ఇలాంటివి పూర్తి చేసేలా జస్టిస్ నవీన్రావు చొరవ తీసుకోవాలని కోరారు.
పిల్లలపై అఘాయిత్యాలను, వేధింపులకు ముగింపు పలికేలా అందరం కలిసి పనిచేయాలని నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి సూచించారు. పిల్లలపై అఘాయిత్యాల కేసుల పరిష్కార ప్రక్రియ వేగంగా జరుగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ప్రత్యేక కోర్టుల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాయిగానీ ఖర్చు చేయడంలేదని విమర్శించారు. వరంగల్ కోర్టును మాడల్గా పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పిల్లలపై వేధింపుల కేసుల పరిష్కారంలో వరంగల్ కోర్టు మెరు గ్గా ఉన్నదని, ఇక్కడ 256 కేసులు నమోదైతే 146 పరిష్కరించారని, 14 కేసుల్లో దోషులకు శిక్ష పడిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు రెండు లక్షలు (92.6 శాతం) పెండింగ్లో ఉన్నాయని, కానీ వరంగల్ కోర్టులో 40 శాతం కేసులే పెండింగ్ ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 2.5 శాతం కేసుల్లో మాత్రమే దోషులకు శిక్ష పడిందని గుర్తు చేశారు.
బాలల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ఉత్తమంగా ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఎనిమిదేండ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో కొత్త మార్గాన్ని చూపిందని తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో వరంగల్ కోర్టు కాంప్లెక్స్ దేశంలోని అన్ని కోర్టులకు స్ఫూర్తిగా నిలిచిందని, అన్ని జిల్లాలకు ఇది మాడల్ కోర్టు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్రావు అన్నారు. ఇక్కడి పోక్సో కోర్టును బాగా నిర్వహిస్తున్నారని అభినందించారు. కోర్టుకు వచ్చే వారి కోసం రూ.5 భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, గోపి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా రాధాదేవి, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి నందికొండ నర్సింగరావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ బీ జయాకర్, దుస్స జనార్దన్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్మోహన్, ప్రధాన కార్యదర్శి జీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.