Palle Prakruthi vanam | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లెప్రకృతి వనాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. తెలంగాణ మాదిరిగానే ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేయాలని సూచించింది. ప్రతి గ్రామంలో పార్కు తరహాలో పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని కొనియాడింది. పల్లెప్రకృతి వనాలను ఇప్పటికే నీతి అయోగ్ సమర్థించగా తాజాగా కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రశంసించారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పెర్ఫార్మెన్స్ రివ్యూ కమిటీ (పీఆర్సీ) సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్కుమార్సింగ్, ఇతర ఉన్నతాధికారుల సూచన మేరకు తెలంగాణలోని పల్లెప్రకృతి వనాలపై రాష్ట్ర అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ ప్రజెంటేషన్ను శ్రద్ధగా ఆలకించిన ఇతర రాష్ర్టాల అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణ చేపట్టిన పల్లెప్రకృతి వనం విధానం బాగున్నదని, ఇదే విధానాన్ని దేశం మొత్తం అమలు చేయడానికి, ఇతర రాష్ట్రాల అధికారులకు అవగాహన కల్పించడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించినట్టు కేంద్ర అధికారులు తెలిపారు. ఇప్పటికే నీతి ఆయోగ్ కూడా పల్లెప్రకృతి వనాలను అభినందించిందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రీన్కవర్ 7.7% పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొన్నదని గుర్తుచేశారు.
కొత్త పంచాయతీరాజ్ చట్టంలో 10% నిధులు తప్పనిసరిగా గ్రీనరీకి ఖర్చు చేయాలని నిబంధన విధించినట్టు తెలిపారు. ఆ నిధులు మొక్కల పెంపకం, పల్లెప్రకృతి వనాలు, బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు ఎంతో దోహదం చేశాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 1,004 నర్సరీలు ఉండగా ప్రస్తుతం ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున 12,769 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయని తెలిపారు. ఇంటింటికీ పండ్ల మొక్కల పంపిణీ, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. వాకింగ్ ఏరియా, ఓపెన్ జిమ్లు, పిల్లలకు ఆటస్థలం, రిక్రియేషన్కు అనువుగా పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
పల్లెప్రకృతి వనాల ఏర్పాటు పూర్తయిన తరువాత బృహత్ పల్లె ప్రకృతి వనాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. బీపీవీలు ప్రతి మండలానికి ఐదు చొప్పున ఒక్కొక్కటి 5 నుంచి 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 2,735 బీపీవీలను 6,297 ఎకరాల్లో ఏర్పాటు చేశామని వివరించారు. పల్లె ప్రకృతి వనాల్లో కూర్చోవడానికి బెంచీలు, పిల్లలు అడుకోవడానికి పరికరాలను ఆయా గ్రామాలకు చెందిన దాతలు అందజేశారని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు కూడా చురుగ్గా వ్యవహరించారని అభినందించారు.