హైదరాబాదాద్, సిటీబ్యూరో అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు ‘ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్’ (ఐటీఐఆర్)ను ఇవ్వాలని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు రద్దు చేయాలన్న నిర్ణయంపై పునఃపరిశీలన చేయాలన్నారు. దేశరాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన మొబైల్ కాంగ్రెస్లో భాగంగా నిర్వహించిన డిజిటల్ ఇండియా సదస్సులో మాట్లాడారు. తెలంగాణలో టైర్ 2 పట్టణాలకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)లను కేటాయించాలని డిమాండ్ చేశారు. విస్తృతంగా వ్యాపిస్తున్న అశ్లీలత ముప్పును అరికట్టేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ), టెలికాం నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. సైబర్ క్రైమ్ నిరోధానికి కొత్త చట్టం తీసుకురావాలన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై బలమైన నియంత్రణ ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని సిఫార్సు చేశారు. అలాగే, ఎనిమిదేండ్లలోనే ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన వేగవంతమైన పురోగతితోపాటు వివిధ ఇ-గవర్నెర్స్ కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణలో స్టార్టప్ల కోసం టీ హబ్, మహిళల కోసం వీహబ్తోపాటు విద్యాసంస్థల్లోనూ స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలకూ ఐటీరంగాన్ని విస్తరించామని తెలిపారు. ఈ సదస్సులో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, వివిధ రాష్ర్టాల ఐటీ శాఖ మంత్రులు పాల్గొన్నారు.