దంతాలపల్లి, ఏప్రిల్ 27: విద్యార్థులకు సత్ప్రవర్తన నేర్పించాల్సిన గురువే.. వారిపట్ల వక్రబుద్ధిని చూపాడు. చివరకు గ్రామస్థుల చేతిలో తన్నులు తిన్నాడు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురానికి చెందిన బీ మహేందర్ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మహేందర్ తరచూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో విసిగిపోయిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. బుధవారం వారంతా ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లి నిలదీసి దేహశుద్ధి చేశారు. ఓ విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.