మంత్రిమండలి నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్లకు ఉండదు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు స్వయంగా నిర్వర్తించే విధులు ఉండవు. ఏ విధులు లేని గవర్నర్ ఆర్టికల్ 163 ప్రకారం మంత్రివర్గం సలహాలను తప్పక అంగీకరించాలి.
-గవర్నర్ అధికారాల చర్చలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్
బీఆర్ అంబేద్కర్ వ్యక్తం చేసిన అభిప్రాయం
గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి ఏజెంటుగా పని చేయరాదని హరిగోవింద్ వర్సెస్ రఘుకుల్ తిలక్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రాజ్యాంగ నిపుణులు టీటీ కృష్ణమాచారి వాదన (మే 1, 1979) గవర్నర్ రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేనివారే ఉండాలి. అలాంటప్పుడే గవర్నర్గా నిష్పాక్షికంగా వ్యవహరిస్తారు
-రాజ్యాంగ నిఫుణులు కేకే మున్షీ, టీటీ కృష్ణమాచారి
గవర్నర్ల ద్వారా విపక్షాలు పాలిస్తున్న రాష్ర్టాల్లో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నది. రాష్ర్టాల హక్కులను హరిస్తున్నది. సర్కారియా, ఫూంచ్ కమిషన్ల సిఫారసులు అమలు చేయడం లేదు.
-ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు
క్రియాశీల రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనని నిర్లిప్త వ్యక్తి గవర్నర్ పదవికి అర్హులు
-సర్కారియా కమిషన్
Sarkaria Commission | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): క్రియాశీల రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనని నిర్లిప్త వ్యక్తి గవర్నర్ పదవికి అర్హులు అని సర్కారియా కమిషన్ చెప్తుండగా.. దీనికి తూట్లు పొడుస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యారాజన్ పక్కా రాజకీయ నాయకురాలైనా ఆమెకు పదవిని కట్టబెట్టింది. గవర్నర్ల నియామకంలో అనుసరించాల్సిన నియమావళిపై సర్కారియా కమిషన్ చేసిన సిఫారసులకు పూర్తి విరుద్ధంగా ఈ నియామకం చేసింది. విద్యార్థి దశ నుంచే తమిళిసై క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. 2005 నుంచి 2010 వరకు బీజేపీ ఆల్ ఇండియా మెడికల్ వింగ్ దక్షిణాది రాష్ర్టాల కో-కన్వీనర్గా పనిచేశారు. 2010 నుంచి 2013 వరకు బీజేపీ తమిళనాడు స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
2013 నుంచి 2014 వరకు బీజేపీ తమిళనాడు వైస్ ప్రెసిడెంట్గా, నేషనల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2014 ఆగస్టు 16 నుంచి 2019 సెప్టెంబర్ 1వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ గవర్నర్గా నియమించబోతున్నారన్న సమాచారం మేరకు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కేవలం వారం రోజులకే 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. కాగా, గవర్నర్ల ద్వారా విపక్షాలు పాలిస్తున్న రాష్ర్టాల్లో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నది.. రాష్ర్టాల హక్కులను హరిస్తున్నది.. సర్కారియా, ఫూంచ్ కమిషన్ల సిఫారసులు అమలు చేయడం లేదని నాడు సీఎం హాదాలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ.. నేడు ప్రధాని హోదాలో గవర్నర్లను అడ్డుపెట్టుకొని బీజేపీయేతర రాష్ర్టాల్లో కిరికిరి పంచాయితీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజ్యాంగ పరిరక్షకులుగా కాకుండా ఫక్తు రాజకీయ నాయకులుగా గవర్నర్లు వ్యవహరించిన ప్రతిసారి సర్కారియా కమిషన్ చేసిన సిఫారసులు ప్రాముఖ్యతను సంతరించుకొంటున్నాయి. గవర్నర్ల నియామకం మొదలు ఈ వ్యవస్థ దుర్వినియోగం అయిన అనేక సందర్భాల్లో సర్కారియా కమిషన్ సిఫారసులను సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే, కేంద్రం, రాష్ర్టాల మధ్య సామరస్యాన్ని పునరుద్ధరించడానికి ఆ సిఫారసులను అత్యవసరంగా అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. సర్కారియా కమిషన్ సిఫారసులు అమల్లోకి తీసుకరావడం ద్వారా గవర్నర్ వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. సమాఖ్యవాదానికి గవర్నర్లు భంగం కలిగించే ప్రయత్నం చేసిన సందర్భాల్లో సర్కారియా కమిషన్ సిఫారసులు అన్వయించదగిన భవిష్యత్తు పత్రంగా నిరూపించబడ్డాయి.