హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): దేశంలోని పేదలు ప్రధానంగా కోరేది ఉత్తమ విద్య, మెరుగైన వైద్యమని, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ రెండింటినీ సమర్థంగా అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ముఖ్యంగా మొహల్లా క్లినిక్ల పనితీరు అద్భుతంగా ఉన్నదన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ శనివారం ఆఫ్రికా ఎవెన్యూ మార్గ్లోని మహమ్మద్పూర్ మొహల్లా క్లినిక్ను సందర్శించారు. అక్కడి సదుపాయాలను పరిశీలించారు. డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన కొత్తలో తాను ఢిల్లీకి వచ్చినప్పుడు కొందరు మిత్రులు కలిసి ఢిల్లీలోని మొహల్లా క్లినిక్లు బాగా పనిచేస్తున్నాయని చెప్పారన్నారు. దీంతో క్లినిక్ల పనితీరును అధ్యయనం చేసేందుకు తాను ప్రత్యేకంగా తెలంగాణ నుంచి వైద్యాధికారుల బృందాన్ని పంపానని తెలిపారు. వారు ఇక్కడి అధికారులతో, డాక్టర్లతో మాట్లాడారని, ప్రజల స్పందన తెలుసుకోగా, అందరూ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారని గుర్తుచేశారు.
మొహల్లా క్లినిక్ల స్ఫూర్తితో తెలంగాణలో బస్తీ దవాఖానలను ప్రారంభించామన్నారు. పేదలు ప్రధానంగా చేసే డిమాండ్ ఉత్తమ విద్య, వైద్యం అని, ఈ రెండూ ఢిల్లీలో సమర్థంగా అమలవుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ను, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. మొహల్లా క్లినిక్లలో రిటైర్డ్, ప్రైవేట్ డాక్టర్లు పనిచేస్తుండటం గొప్ప విషయమన్నారు. ఒక్కో షిప్ట్లో 100 మందికిపైగా చికిత్స చేస్తున్నారని తెలిపారు. మొహల్లా క్లినిక్ల వంటివాటిని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు.