కాచిగూడ, జూన్ 6: దేశంలో పీడిత వర్గాల కోసం నిరంతరం పనిచేస్తున్న బీసీల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య మీద అగ్రవర్ణాల పెత్తందారు రవీందర్రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని తెలంగాణ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ప్రతినిధులు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడ హోటల్లో మీడియా సమావేశంలో ఫోరం రాష్ట్ర కన్వీనర్ నాగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య మీద దాడి జరిగితే బీసీల ఆత్మగౌరవం మీద దాడి జరిగినట్టేనని, కృష్ణయ్య రాజ్యసభ రావటం చంద్రబాబుకు మింగుడు పడటం లేదని విమర్శించారు.
కృష్ణయ్యపై కేసు పెట్టడంలో చంద్రబాబు కుట్ర దాగి ఉన్నదని, త్వరలో వాస్తవాలను వెలికి తీస్తామని స్పష్టం చేశారు. అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రవీందర్రెడ్డిపై రూ.15 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు మన్నారం నాగరాజు, రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, పీ పద్మారావు, సింగయ్య గౌడ్, కోల జనార్దన్, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మణికుమార్, శోభ యాదవ్, కిరణ్కుమార్, గొల్లపల్లి దయానంద్తో పాటు లాయర్స్ సంఘాల నాయకులు, కార్మిక సంఘాలు పాల్గొన్నారు.