రంగారెడ్డి, మార్చి 17 (నమస్తేతెలంగాణ) : గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమ భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదని బాధిత రైతులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమను బలి చేస్తారా? అని యాచారం మండలం మర్లకుంట తండా రైతులు ప్రశ్నిస్తున్నారు. ‘గ్రీన్ఫీల్డ్ రోడ్డు మాకొద్దు.. మా భూములే మాకు ముద్దు’ అంటూ మంగళవారం వారు మర్లకుంట తండాలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భూములు కోల్పోతున్న అనేక గ్రామాల రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. మరికొందరు కోర్టులను సైతం ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ భూములిచ్చేది లేదని గ్రీన్ఫీల్డ్రోడ్డు పరిధిలోకి వచ్చే మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు మండలాలకు చెందిన రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ఓవైపు రైతులు ఆందోళన చేపడుతుండగానే.. మరోవైపు ప్రభుత్వం అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులను ప్రారంభించింది. తమ భూముల నుంచి బలవంతంగా రోడ్లు వేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ తమ పొలాల వద్దనే కాపు కాస్తున్నారు. ఇప్పటికే కుర్మిద్ద అనుబంధ గ్రామాలైన మర్లకుంటతండా, ముచ్చర్లకుంటతండాతోపాటు సాయిబండా తండాలకు చెందిన రైతులు అధికారులు నిర్వహించే సర్వేను అడ్డుకున్నారు. రైతులకు మద్దతుగా వివిధ రాజకీయపార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు ముందుకొస్తున్నారు. దీంతో ఫ్యూచర్సిటీ కోసం వేసే గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అడుగడుగునా అడ్డంకులు తగులుతున్నాయి.. దీక్షలో కూర్చున్న సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.
అలాంటప్పుడు తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే తాము ఫార్మాసిటీ కోసం భూములిచ్చినట్టు చెప్పారు. పట్టా భూములు మాత్రం ఇచ్చేది లేదని చెప్తున్నా ప్రభుత్వం పట్టా భూములను టీజీఐఐసీ పేరుమీద బదలాయించి నిషేధిత జాబితాలో చేర్చినట్టు వారు మండిపడ్డారు. తమకు తెలియకుండానే తమ పరిహారాన్ని అథారిటీలో జమచేశారంటూ ధ్వజమెత్తారు. తమకున్న కొద్దిపాటి భూమిని తీసుకోవద్దని, భూములు లేకపోతే తాము ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రిలే దీక్షలో లంబాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంపాల్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిషన్నాయక్, ప్రజాసంఘం నాయకుడు పృథ్వీరాజ్, కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ నాయక్, శ్రీకాంత్నాయక్, రాజునాయక్, ఉపసర్పంచ్ రవీందర్, రైతులు పాల్గొన్నారు.