హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన’ కార్యక్రమం పూర్తికాగానే తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ (టీజీవోసీఏ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొంటామని ఆ సంఘం వ్యవస్థాపక కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్రావు, మరో నేత శ్యామ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా 33 జిల్లాలతో పాటు రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. టీజీవో (శ్రీనివాస్గౌడ్ వర్గం) కార్యవర్గాన్ని రద్దు చేయడాన్ని శ్రీనివాస్రావు స్వాగతించారు. సభ్యత్వ నమోదులేకుండా ఓటర్లిస్టును ప్రకటించకుండా.. రిటైర్డ్ అధికారులను ఎన్నికల అధికారులుగా నియమించడం చెల్లదని చెప్పారు. అసోసియేషన్ బైలాస్ ప్రకారం.. సీనియర్ అధికారి లేదా జనరల్ బాడీ ఎంపికచేసిన అధికారి ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని తేల్చిచెప్పారు. అసోసియేషన్ భవనాన్ని త్వరలో తమకు కేటాయిస్తారని ధీమా వ్యక్తంచేశారు.