High Court | హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా బతుకమ్మకుంట పరిధిలోని కట్టడాలను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించింది.
కోర్టు వివాదంలో ఉన్న బతుకమ్మకుంట పరిధిలోని స్థలం విషయంలో స్టేటస్ కో కొనసాగించాలని జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఏ సుధాకర్రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్రావులతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ఈ విచారణకు రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ పిటిషన్పై తొలుత అక్టోబర్ 31వ తేదీన విచారించిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో నవంబర్ 27వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని రంగనాథ్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే బాచుపల్లిలో అత్యవసర పనులు ఉన్నందున హాజరుకాలేకపోతున్నానని.. మినహాయింపు కోరుతూ రంగనాథ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నవంబర్ 27న విచారణ జరిపిన ధర్మాసనం రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ ఊరిళ్ల వాదిస్తూ, రంగనాథ్ అధికారిక విధుల్లో పాల్గొనాల్సి ఉన్నందున విచారణకు హాజరుకాలేదని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘రంగనాథ్ కోర్టు పట్ల చూపిన దయకు అభినందనలు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కోర్టు తలచుకుంటే ధికరణ చర్యలు ఉంటాయని, ఇదే కోర్టు హాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబెట్టిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కోర్టుకున్న అధికారాలను రంగనాథ్ మరచిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాంటి పరిస్థితులను రంగనాథ్ తెచ్చుకోవద్దని సూచించింది. డిసెంబర్ 5న జరిగే విచారణకు వ్యక్తిగతంగా రంగనాథ్ హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. లేకపోతే నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్రావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తూ.. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా ఎందుకు కూల్చారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నించారు. దీనికి వ్యర్ధాలనే తొలగించామని హైకోర్టుకి రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.