హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పేపర్-1, పేపర్-2 పరీక్షలు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో నిర్వహించగా, మొత్తంగా పరీక్షలకు 90 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు తెలిపారు. గతంతో పోల్చితే ఈసారి రెండు పేపర్లలో ప్రశ్నల కాఠిన్యత తక్కువగా ఉన్నదని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. టెట్ వ్యాలిడిటీని జీవితకాలానికి వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో ఈసారి ఎక్కువగా కొత్త అభ్యర్థులే పరీక్ష రాశారు. వీరిలో చాలామంది తప్పక అర్హత సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. పరీక్షలను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్వహించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించినవారికి ధన్యవాదాలు తెలిపారు. టెట్ ఫలితాలు ఈ నెల 27న విడుదల చేయనున్నారు.
ఐదు రోజుల శిశువుతో పరీక్షకు..
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూన్ 12: టెట్లో అర్హత సాధించి ఉపాధ్యాయురాలిగా స్థిరపడి తీరాలనే తపనతో ఓ బాలింత తన ఐదు రోజుల వయసున్న శిశువుతో వచ్చి పరీక్ష రాసింది. వైరాకు చెందిన రాణి ఐదు రోజుల క్రితమే ఓ శిశువుకు జన్మనిచ్చింది. అంతలోనే పరీక్ష తేదీ రావటంతో పరీక్ష హాల్లో శిశువును తన పక్కనే బెంచీపై పడుకోబెట్టుకొని పరీక్ష రాసింది. ఈమెతో పలువురు బాలింతలు, చిన్న పిల్లల తల్లులు తమ చంటి పిల్లలను ఎత్తుకొని చాలాచోట్ల పరీక్షకు హాజరయ్యారు. వారి భర్తలు, కుటుంబ సభ్యులు పిల్లలను పరీక్షా కేంద్రాల బయట ఆడించారు.
పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు
అమీన్పూర్, జూన్ 12: టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ మహిళకు పురిటినొప్పులు రావడంతో అంబులెన్స్లో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని లైఫ్లైన్ స్కూల్లో సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కృష్ణాపూర్కు చెందిన అర్చన టెట్ పరీక్షకు హాజరైంది. పరీక్ష రాస్తుండగా మధ్యలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో అధికారులు హుటాహుటిన 108 అంబులెన్స్కు ఫోన్ చేసి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు ప్రమాదం లేదని, మరో రెండు రోజుల్లో ప్రసవం జరిగే అవకాశాలున్నాయని, అప్పటివరకు దవాఖానలోనే ఉండాలని సూచించారు.