TET Exam : తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల బోధనా అర్హత కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికిగాను సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఈ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,983 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షలను ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 9:00 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:30 వరకు వివిధ సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.
సెప్టెంబర్ 8న పేపర్-1, పేపర్-2 (తెలుగు, ఇంగ్లీష్ మీడియం) పరీక్షలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 9న మిగిలిన మాధ్యమాలకు సంబంధించిన పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ, సంబంధిత పాఠశాలల్లో పనిచేస్తూ.. ఇప్పటికీ నిర్దేశిత అర్హత ప్రమాణాలను సాధించని ఉపాధ్యాయుల కోసమే ఈ ప్రత్యేక టెట్ను నిర్వహిస్తున్నారు. హాల్ టికెట్లు, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ schooledu.telangana.gov.in సందర్శించాలని విద్యాశాఖ సూచించింది.