TET | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ‘గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతికి టెట్ అర్హత సరే.. మరీ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంకు టెట్ అవసరమా? లేదా? స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్ఎం పదోన్నతికి టెట్ అవసరమా? లేదా?’ ఇది రాష్ట్ర విద్యాశాఖ వాదనలు..!
‘ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధిస్తున్న ఎస్జీటీలకు లో ఫిమేల్ లిట్రసీ రేట్ (ఎల్ఎఫ్ఎల్) హెచ్ఎం పదోన్నతి పొందేందుకు టెట్ అవసరం లేదు. 6, 7, 8 తరగతుల్లో బోధిస్తున్న లాంగ్వేజ్ పండిట్లకు హోదా మారడం లేదు కనుక వీరికి టెట్ అవసరం లేదు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహించవచ్చు. 1-5 తరగతులు బోధిస్తున్న వారు హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందేందుకు మాత్రమే టెట్ పేపర్ -2 అవసరం. రాష్ట్ర ప్రభుత్వం టెట్ పాస్ పర్సంటేజీని కుదించవచ్చు. టీచర్లకు ప్రత్యేకంగా టెట్ను నిర్వహించవచ్చు. సబ్జెక్టులను బట్టి సిలబస్ను నిర్ణయించుకోవచ్చు..’ ఇదీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నేతలకు ఎన్సీటీఈ ఇచ్చిన స్పష్టత..!!
ఇలాంటి భిన్న వాదనలు అటు ఎన్సీటీఈ నుంచి రాష్ట్ర విద్యాశాఖ నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్సీటీఈ.. ఎన్సీటీఈ మీద రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం నెపం వేసి తప్పించుకుంటున్నాయి. ఈ వైఖరి రాష్ట్రంలోని టీచర్ల పదోన్నతులకు అడ్డంకిగా మారింది. పదోన్నతులు వస్తాయని ఆశిస్తున్న వారికి నిరాశ ఎదురవుతున్నది. పదోన్నతులు లభించక నియమితులైన పోస్టులోనే రిటైర్మెంట్ కావాల్సిన పరిస్థితి టీచర్లలో నెలకొన్నది.
కోర్టు కేసుతో బ్రేకులు..
ఎనిమిదేండ్లుగా నిలిచిపోయిన పదోన్నతులకు గత కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్నిచ్చింది. దీంతో నిరుడు డిసెంబర్లో టీచర్ల పదోన్నతులు, బదిలీలను ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. తొలుత హెచ్ఎంలను బదిలీచేసింది. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతుల ప్రక్రియ చేపట్టింది. వాస్తవానికి 1,947 స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా కల్పించాల్సి ఉండగా, మల్టీజోన్-2లో బదిలీలు, పదోన్నతులపై కేసుల కారణంగా ఈ జోన్ పరిధిలో జిల్లా పరిషత్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు నిలిచిపోయాయి.
మల్టీజోన్-1లోని ప్రభుత్వ స్కూళ్లు, జడ్పీ స్కూళ్లు, మల్టీజోన్ -2 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లల్లో అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించారు. దీంతో 1,219 స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. మొదట సీనియార్టీ జాబితా విషయంలో కోర్టు కేసుతో మల్టీజోన్ -2లో జిల్లా పరిషత్ టీచర్ల పదోన్నతులు నిలిచిపోయాయి. ఆ తర్వాత కొందరు టీచర్లు పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని.. టెట్ ఉన్నవారికే పదోన్నతులు కల్పించాలని కోర్టు కెళ్లారు. దీంతో మల్టీజోన్ -2లో హెచ్ఎంలతోపాటు, రెండు మల్టీజోన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు బ్రేకులుపడ్డాయి.
స్పష్టత కోరిన విద్యాశాఖ
విద్యాహక్కు చట్టం, ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి. టీచర్ల నియామకంతోపాటు పదోన్నతులకు సైతం టెట్ తప్పనిసరి అని ఎన్సీటీఈ స్పష్టంచేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందాలంటే టెట్ -2లో ఉత్తీర్ణత కావాలి. పదోన్నతులకు టెట్ తప్పనిసరి కావడంతో 2015లోపు టీచర్లంతా ఉత్తీర్ణులు కావాలని కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. ఆ తర్వాత మరో ఐదేండ్లకు పొడిగించారు. రాష్ట్రంలో విద్యాశాఖ కొత్త రిక్రూట్మెంట్ వరకే టెట్ను అమలుచేసింది. టెట్తో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. పలు అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ ఇటీవలే ఎస్సీటీఈ చైర్మన్ను కలిసి స్పష్టత కోరింది. దీనిపై ఎస్సీటీఈ స్పష్టతనివ్వలేదని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఎన్సీటీఈ చైర్మన్ను కలిసిన తపస్ నేతలు
టెట్పై స్పష్టత కోరుతూ తపస్ ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ వెళ్లి ఎన్సీటీఈ చైర్మన్ను కలిసింది. తపస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేశ్, సహాధ్యక్షుడు అయిల్నేని నరేందర్రావు అదనపు ప్రధాన కార్యదర్శి టీ పెంటయ్య, ఉపాధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్, ఎస్ వెంకట్రెడ్డి ఎన్సీటీఈ చైర్మన్ యోగేశ్సింగ్తో సమావేశమయ్యారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పదోన్నతి కల్పించేందుకు మాత్రమే టెట్ అవసరమని, మిగతా పదోన్నతులకు టెట్ అవసరం లేదని ఎన్సీటీఈ చైర్మన్ తమకు స్పష్టతనిచ్చినట్టు తపస్ నేతలు తెలిపారు. టీచర్లకు ప్రత్యేకంగా టెట్ను నిర్వహించవచ్చని, సిలబస్ను తగ్గించవచ్చని, ఎన్సీటీఈ నిబంధనలు సడలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తమకు తెలిపినట్టు నేతలు వెల్లడించారు. అయితే, టెట్ దరఖాస్తుల గడువు ఇప్పటికే ముగిసింది.