హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మం డలం ఆకునూరు గ్రామంలోని పాటిగడ్డమీద ఇక్షాకుల కాలం నాటి టెర్రకోట స్త్రీ శిల్పం లభించింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన కొలిపాక శ్రీనివాసుకు అది దొరికింది. ఈ శిల్పాన్ని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ టెర్రకోట బొమ్మ తలపైనున్న ‘మకరిక’ శిరోజాలంకరణ, నుదిట చూడామని, చెవులకు కుండలాలు, కన్ను, ముక్కు తీరు నాగార్జునకొండ, కొండాపూర్లలో దొరికిన టెర్రకోట బొమ్మలనే పోలి ఉన్నదని తెలిపారు. ఈ బొమ్మను పరిశీలించిన చరిత్రకారుడు, స్థపతి ఈమని విశ్వనాగిరెడ్డి కూడా ఇక్షాకుల కాలందేనని నిర్ధారించారు.