వరంగల్, జూన్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీముకు నిరసనగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్పై దాడిచేసిన ఘటనలో రైల్వే పోలీసు కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేశ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. శనివారం వరంగల్ ఎంజీఎం నుంచి మృతుడి స్వగ్రామమైన ఖానాపూర్ మండలం దబీర్పేట వరకు సుమారు 50 కిలోమీటర్ల వరకు అంతిమయాత్ర ఉద్విగ్నంగా కొనసాగింది. దారి పొడవునా ప్రజలు నివాళులర్పించారు. జోహార్ రాకేశ్… రాకేశ్ అమర్ రహే, మోదీ డౌన్డౌన్, అగ్నిపథ్ గో బ్యాక్ నినాదాలు మిన్నంటాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాకేశ్ అంత్యక్రియలను దగ్గరుండి పూర్తిచేశారు.
కన్నీటి వీడ్కోలు
రైల్వే పోలీసుల కాల్పుల్లో శుక్రవారం కన్నుమూసిన రాకేశ్ మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో భద్రపరిచారు. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తీసుకొచ్చారు. రాకేశ్ను చివరిసారి చూసేందుకు శనివారం తెల్లవారుజాము నుంచే భారీగా యువకులు, ప్రజలు తరలివచ్చారు. మృతదేహాన్ని తరలించేందుకు తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు. రాకేశ్ కుటుంబసభ్యులు ఎంజీఎం మార్చురీలో మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వారిని ఓదార్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రాకేశ్ మృతదేహానికి నివాళులు అర్పించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, మృతదేహాన్ని భుజాలపై మోసుకొచ్చారు. ప్రత్యేక వాహనంలో ఎంజీఎం మార్చురీ నుంచి ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీగా రాకేశ్ అంతిమయాత్ర మొదలైంది. పోచమ్మమైదాన్, ధర్మారం, నర్సంపేట మీదుగా దబీర్పేట వరకు సాగింది. దారి పొడవునా ప్రజలు, యువత నివాళులర్పించారు. నర్సంపేటలో ప్రజలు భారీగా తరలివచ్చారు.సాయంత్రం ఐదున్నర గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి.
అంత్యక్రియల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, రెడ్యానాయక్, తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, ధనసరి సీతక, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, తక్కళ్లపల్లి రవీందర్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర రోడ్డు అభివృద్ది సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి పాల్గొన్నారు.
నియోజకవర్గంలో బంద్
రాకేశ్ అంతిమయాత్రలో ప్రధాని మోదీపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. అగుగడునా మోదీ దిష్టిబొమ్మలను ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశాయి. వరంగల్లో పలుచోట్ల యువకులు నిరసన తెలిపారు. మోదీ డౌన్డౌన్, అగ్నిపథ్ గో బ్యాక్ నినాదాలు చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్లోకి వెళ్లేందుకు యువకులు ప్రయత్నించారు. కేయూ విద్యార్థులు రైల్వేస్టేషన్ ఎదుట నిరసన తెలుపగా, పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఎంజీఎం సమీపంలోని బీఎస్ఎన్ఎల్ భవనంపై దాడికి పలువురు యత్నించారు. ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. బోర్డులను ధ్వంసం చేశారు. రాకేశ్ అంతిమయాత్ర నేపథ్యంలో వరంగల్ నుంచి దబీర్పేట వరకు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. రాకేశ్ మృతికి నిరసనగా నర్సంపేటలో తలపెట్టిన బంద్ విజయవంతమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాలేదు. నియోజకవర్గం పరిధిలోని నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి మండలాల్లోనూ బంద్ కొనసాగింది.
కేంద్రం యువతకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఎర్రబెల్లి
రాకేశ్ను కేంద్రమే హత్య చేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారని మంత్రి దయాకర్రావు అన్నారు. కేంద్రం వెంటనే దేశ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్కువ జనాభా కలిగిన దేశాల తరహాలో కేంద్రం మన దేశంలోనూ ఔట్సోర్సింగ్ విధానాన్ని అమలు చేసి రక్షణ రంగాన్ని అంబానీ, అదానీలకు కట్టబెట్టాలని చూస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొని కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
అగ్నిపథ్ స్కీము సరైనదేనని నిరూపించేందుకు, బీజేపీ నేతలు ముందుగా వారి కుటుంబసభ్యులను అందులో చేర్చాలని డిమాండ్చేశారు. రాకేశ్ మృతితో బీజేపీ తుడుచుపెట్టుకుపోతుందని హెచ్చరించారు. సైనికుడిగా మారి దేశానికి సేవ చేయాల్సిన దామెర రాకేశ్ ప్రాణాన్ని బలితీసుకున్న కేంద్రం మెడలు వంచడం ఖాయమని హెచ్చరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతుల మృతికి కారణమైందని, ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో యువకుల హత్యలకు పాల్పడుతున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం నో కిసాన్, నో జవాన్ అనే కొత్త విధానాన్ని అమలు చేస్తూ దేశ రక్షణ విభాగాన్ని నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
మా కొడుకు గతి మరొకరికి రావొద్దు
ఆర్మీలో ఉద్యోగం చేయాలనేది నా కొడుకు కల. అక్క స్ఫూర్తితో ఆర్మీలో ఉద్యోగం సాధించడానికి చాలా కష్టపడ్డడు. ఫిజికల్ టెస్ట్ పాసై, రాత పరీక్ష కోసం ఎదురుచూస్తున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిండు. ఈ విధానంతో పూర్తిస్థాయి ఉద్యోగాన్ని సాధించడం కష్టమని చెప్పాడు. ఎన్నో కలలు కన్న చాలా మంది పిల్లల జీవితాలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తున్నది. ఇప్పటికైనా పాత విధానాన్ని అమలు చేసి మా కొడుకుకు పట్టిన గతి మరొకరికి రాకుండా చూడాలి.
– దామెర కుమారస్వామి, మృతుడి తండ్రి
అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలి
అగ్నిపథ్ పథకంపై కేంద్రం వెనక్కి తగ్గాలి. దేశవ్యాప్తంగా యువకులు కదం తొక్కారని, ఇది మరింత పెద్దది కాకముందే కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ ఉంటే.. బీహార్, హర్యానా, యూపీ అల్లర్ల వెనుక అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నా యా?, మరి ఆయా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీనే అల్లర్లకు కారణమని ఒప్పుకొంటారా?.
– దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
బండీ.. రెచ్చగొట్టే మాటలు మానుకో
అగ్నిపథ్ విషయంలో యువతను రెచ్చగొట్టేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య లు చేయడం మానుకోవాలి. బీహార్తోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ హింసాత్మక ఘటనలు జరిగిన విషయం మరిచిపోవద్దు. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే మాటలు సిగ్గుచేటు. యువకుల న్యాయమైన కోర్కెలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలి. ఆర్మీలో పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలి.
– పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్