హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఈ నెల 25న జరుగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయం గందరగోళంగా మారింది. సికింద్రాబాద్లోని జింఖాన గ్రౌండ్లో టీ20 టిక్కెట్లు గురువారం విక్రయిస్తామని హెచ్సీఏ ప్రకటించడంతో తెల్లవారక ముందే భారీసంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకొన్నారు. ఉదయం ప్రధాన గేటు తెరవగానే అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 10 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని యశోద దవాఖానకు తరలించారు. తోపులాటలో కిందపడిపోయిన ఓ మహిళ అపస్మారక స్థితిలోకి చేరుకోగా, బేగంపేట్ మహిళా కానిస్టేబుల్ నవీన కృత్రిమ శ్వాస అందించి (సీపీఆర్ విధానం) కాపాడారు. టికెట్ల కోసం ఉదయం నుంచి క్యూ లైన్లలో వేచి ఉన్న వారికి పోలీసులు మధ్యాహ్నం సమయంలో అరటిపండ్లు, సమెసాలు, నీళ్ల ప్యాకెట్లు అందజేయడం విశేషం. కాగా, తొక్కిసలాట ఘటనపై బాధితులు ఇచ్చే ఫిర్యాదులతోపాటు పోలీసులు కూడా సుమోటోగా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
టీ20 టికెట్ల విక్రయాలు, మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లపై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం మధ్యాహ్నం హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, కార్యవర్గ సభ్యులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ తర్వాత హెచ్సీఏ అభ్యర్థనతో హైదరాబాద్లో టీ20 మ్యాచ్ జరుగుతున్నదని చెప్పారు. కానీ, కొంతమంది రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జింఖానా గ్రౌండ్లో తొక్కిసలాటకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్టు ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వం లేదా హెచ్సీఏ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. మ్యాచ్ను సజావుగా నిర్వహించేలా ప్రభుత్వం, హెచ్సీఏ సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయని చెప్పారు. ఈ మ్యాచ్కు సంబంధించి టికెట్ల విక్రయ బాధ్యతలన్నీ హెచ్సీఏకు ఉన్నాయని, అభిమానుల అభ్యర్థన మేరకు కొన్ని టికెట్లను ఆఫ్లైన్లో విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు. అభిమానులు లక్షల్లో ఉండటంతో అందరికీ టికెట్లు దొరికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇప్పటివరకు విక్రయించిన టికెట్ల వివరాలను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని హెచ్సీఏను మంత్రి ఆదేశించారు.
టికెట్ల విక్రయాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ప్రభుత్వ సహకారంతో మ్యాచ్ను విజయవంతంగా నిర్వహిస్తామని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.హెచ్సీఏతోపాటు అజారుద్దీన్పై కేసు తొక్కిసలాట ఘటనలో నిర్వాహకులు, హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్పై కేసు నమోదైంది. టికెట్ల విక్రయం కోసం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోపాటు బ్లాకులో టికెట్లు అమ్ముకొన్నారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు బేగంపేట్ పోలీసులు తెలిపారు. తొక్కిసలాటకు హెచ్సీఏ నిర్లక్ష్యమే కారణమని చికిత్స పొందుతున్న బాధితుల ఫిర్యాదుతోపాటు ఎస్సై ప్రమోద్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని అజారుద్దీన్తోపాటు నిర్వాహకులపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.