సిద్దిపేట, ఫిబ్రవరి 3: సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం బాకీ కార్డుల పంపిణీ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తుచేస్తూ బాకీ కార్డులు పంపిణీ చేశారు. అదే వార్డులో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఎకడికి వెళ్తే అకడికి వెళ్లే కాంగ్రెస్ నాయకులు వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు మధ్య తోపులాట చోటుచేసుకున్నది. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్, వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మహేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులను అనుసరించి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తోపులాట చోటుచేసుకున్నది.
ఏసీపీ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇరు పార్టీల నాయకులను అకడి నుంచి పంపించివేశారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు, ఆరుగ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తే, ఎదురుదాడికి దిగుతున్నారని, ప్రశాంతంగా జరుగుతున్న ప్రచారాన్ని ఉద్రిక్తంగా మారుస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బాకీకార్డులు పంపిణీ చేస్తే కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. అయినప్పటికీ ప్రతి ఇంటికీ బాకీ కార్డులను పంపిణీ చేస్తామని స్పష్టంచేశారు.