ఐనవోలు, మార్చి 21: అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన బరిగెల ప్రశాంత్ (28) ఏడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. 4 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో మిరప సాగు చేశాడు. రెండు మూడేండ్ల నుంచి పంట పెట్టుబడికి కలిపి సుమారు రూ.10 లక్షలు అప్పులయ్యాయి.
వాతావరణం అనుకూలించక పంట దిగుబడి సరిగా రాకపోవడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పెట్టుబడి అందక మనస్తాపానికి గురయ్యాడు. అప్పు ఎలా తీర్చాలో తెలియక బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. భార్య అనూష, తల్లి సౌందర్య కూలి పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి తలుపులు పెట్టి ఉన్నాయి. గ్రామస్థుల సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి వేలాడుతున్న ప్రశాంత్ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 9 గంటలకు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఏడాది వయస్సు బాబు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు.