చండూరు : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చొరవతో పది మంది స్వతంత్ర అభ్యర్థులు మునుగోడు ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని, టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికారు. ఉప ఎన్నికల నేపథ్యంలో చండూరులోని పలు వార్డులకు మంత్రి ఇన్చార్జిగా పని చేస్తూ.. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉద్యమకారులు వివిధ ప్రాంతాల నుంచి పలు పార్టీలు సంస్థల ప్రతినిధులుగా పదిమంది యువకులు నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే, వారంతా ఉమ్మడి వరంగల్కు చెందిన వారు కాగా.. విషయం తెలుసుకున్న మంత్రి రంగంలోకి దిగి.. ఆయా అభ్యర్థులను పిలిపించుకొని మాట్లాడారు. వారి సమస్యలు సావధానంగా విని.. అండగా ఉంటామని, పార్టీపరంగా కేటీఆర్ను కలిపించి తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో వారు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం కోసం పని చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని, ఏనాటికైనా ఇంటిపార్టీగా టీఆర్ఎస్ మాత్రమే రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంపడుతూ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికలను తెచ్చి.. ప్రజలను బలిపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ ఉప ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించిన యువకులకు ధన్యవాదాలు తెలిపారు.
త్వరలోనే వారిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిపిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ స్వార్థ పూరిత రాజకీయాలకు పరాకాష్టగా మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని, ఈ ఉప ఎన్నికతో ఒరిగే లాభం ఏమీ లేదని, బీజేపీ మాయమాటలు చెప్పి ప్రజలను వంచిస్తుందని ఆరోపించారు. కాంట్రాక్టర్ స్వార్థ రాజకీయంతోనే ఉప ఎన్నిక వచ్చిందని, మునుగోడు ఆత్మగౌరవాన్ని గెలిపించాలని బాధ్యత ఇక్కడి ప్రజలపైనే ఉందన్నారు.