స్టేషన్ ఘన్పూర్, జనవరి 3: ఐదు దశాబ్దాలపాటు శ్రీరాముడికి సేవ చేస్తూ, గ్రామస్థుల తలలో నాలుకలా మెలిగిన అర్చకుడు చనిపోతే అతడినే దైవంగా భావించి ఏకంగా గుడినే కట్టించారు జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని తాటికొండ గ్రామస్థులు. అంతటి కీర్తి సంపాదించుకున్న ఆ అర్చకుడి పేరు సౌమిత్రి రంగాచార్యులు. అర్చకుడిగా, పురోహితుడిగా, వైద్యుడిగా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆయన 52 ఏండ్లపాటు గ్రామంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామికి సేవలు చేశారు. తండ్రి లక్ష్మణాచార్యుల మరణం తర్వాత 14 ఏండ్ల వయసులోనే అర్చకుడిగా మారిన ఆయన నిరుడు జనవరి 23న మరణించే వరకు స్వామి వారి సేవలోనే గడిపారు.
గతంలో ఓసారి అనివార్య కారణాల వల్ల రంగాచార్యుల కుటుంబం హైదరాబాద్కు వెళ్లిపోయింది. ఆ తర్వాత గ్రామంలోని రాముడికి పూజలు లేకపోవడం, స్థానికంగా రోజూ ఏదో ఒక కీడు జరుగుతుండటంతో గ్రామస్థులు హైదరాబాద్ వెళ్లి రంగాచార్యుల కుటుంబానికి మొరపెట్టుకోవడంతో తిరిగి ఆయన గ్రామానికి చేరుకున్నారు. ఆయన రాకతో గ్రామానికి పట్టిన కీడు తొలగిపోవడంతో సంతోషించారు. గ్రామస్థులు ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. రంగాచార్యులు తమ మధ్య లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న గ్రామస్థుల కోరిక మేరకు ఆయన కుమారులు లక్ష్మణాచార్యు లు, రామాచార్యులు తండ్రికి గుడి కట్టించారు. గురువారం రంగాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామం లో వేడుకలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
13 ఏండ్ల క్రితం ఆలయంలోని రూ.2 కోట్ల విలువైన సీతారామలక్ష్మణుడి విగ్రహాలు చోరీకి గురైతే ఇకపై తాను ఎవరిని కొలవాలంటూ రంగాచార్యులు కన్నీరు పెట్టుకున్నారు. కొన్ని రోజులపాటు మనిషి కాలేకపోయారు. ఆరు నెలల తర్వాత విగ్రహాలను దొంగిలించిన వారు సమీపంలోని పొలంలో పడేస్తే వాటిని తిరిగి ప్రతిష్ఠించారు.
– కృష్ణకుమారి (రంగాచార్యుల సతీమణి)
ఐదు దశాబ్దాలపాటు నాన్నగారు శ్రీరాముడి సేవలో తరించారు. గ్రామం నుంచి హైదరాబాద్కు మారిపోయినా గ్రామస్థులు వచ్చి అభ్యర్థించడంతో తిరిగి గ్రామానికి వెళ్లాం. శ్రీరాముడికి సేవలు చేస్తూనే నాన్న కాలం చేశారు. ప్రజల కోరిక మేరకు ఆయన జ్ఞాపకార్థం దేవాలయ భూమిలోనే ఆలయం నిర్మించాం.
– లక్ష్మణాచార్యులు (రంగాచార్యుల పెద్ద కుమారుడు)
మా గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకుడిగా, గ్రామం లో పురోహితుడిగా, వైద్యుడిగా రంగాచార్యులు ఎన్నో సేవలు అందించారు. ఆయ న కుల, మతాలను పట్టించుకునేవారు కాదు. తమ కష్టాలను దేవుడికి చెప్పుకోవడానికి వచ్చిన భక్తుల కష్టాలు తెలుసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఏటా శ్రీరామ నవమి వేడుకలకు భక్తుల నుంచి విరాళాలు సేకరించి ఘనంగా నిర్వహించేవారు. అందుకే గ్రామ ప్రజల మనస్సులో ఆయన నిలిచిపోయారు.
– అక్కనపల్లి వెంకటయ్య, తాటికొండ