న్యూఢిల్లీ, మే 28: దివంగత ఏపీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపి, దేశంలో గుర్తింపు తెచ్చిన మహానాయకుడని ఒక సందేశంలో పేర్కొన్నారు.
సంక్షేమరాజ్యానికి ఆయన కొత్త నిర్వచనం చెప్పారని, దేశమంతా అనుసరించదగ్గ జనరంజక పాలన అందించారని గుర్తుచేశారు. గొప్ప ప్రజాస్వామికవాది, లౌకికవాది, ప్రజల మనిషి అంటూ స్మృత్యంజలి ఘటించారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా ఆత్మీయ అనుబంధం ఉండేదని తెలిపారు. తెలుగుజాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్కు జయంతులు, శతజయంతులు జరుగుతూనే ఉంటాయని అన్నారు.