అమీర్పేట్, ఏప్రిల్ 23: మహిళలు ఏ రంగంలోనైనా రాణిచగగలరని రాష్ట్ర మం త్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పేర్కొన్నారు. వృత్తి పరంగా ఎదురవుతున్న సవాళ్లను మహిళా జర్నలిస్టులు సమర్థంగా అధిగమిస్తున్నారని ప్రశంసించారు. మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన మహిళా జర్నలిస్టులకు బేగంపేట్లోని టూరిజం ప్లాజాలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న వర్క్షాప్ శనివారం ప్రారంభమైంది.
రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ.. జర్నలిస్టుల పిల్లల చదువులకు సంబంధించి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మహిళలు తమ కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో మహిళలు వివక్షకు, వేధింపులకు గురికాకుండా చూసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘మహిళల అస్తిత్వం, లింగ వివక్ష, మీడియా ధోరణులు’ అనే అంశంపై ప్రొఫెసర్ విమల కొల్లాపూర్, ‘మీడియాలో కొరవడుతున్న మహిళల ప్రాతినిధ్యం’ అనే అంశంపై ప్రొఫెసర్ పద్మజా షా ప్రసంగించారు.