హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ: కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. రెండు వేర్వేరు విభాగాల్లో తెలంగాణలోని నాలుగు జిల్లాలు అగ్రభాగంలో నిలిచాయి. 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ప్రకటించిన ర్యాంకింగ్స్లో త్రీస్టార్ విభాగంలో సిద్దిపేట, జగిత్యాల జిల్లాలు దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఫోర్ స్టార్ విభాగంలో సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో, పెద్దపల్లి జిల్లా 3వ స్థానంలో నిలిచాయి. ర్యాంకులు వచ్చిన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆయా జిల్లాల అధికారులు, సిబ్బంది, ప్రజలను అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి లాంటి కార్యక్రమాలు అవార్డులు రావడానికి దోహదపడుతున్నాయని చెప్పారు. తెలంగాణకు అవార్డులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం నిధులు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామ సర్పంచ్ మీనాక్షికి స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డు రావడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభినందనలు తెలియజేశారు.