కాళ్లకు చెప్పై, దండోరా డప్పై ఊరికి చివరన ఉంటూ పల్లెకు కాపైన దళితులకు మంచి రోజులు స్వరాష్ట్రంలోనే వచ్చాయంటే అతిశయోక్తి కాదు. సెంట్రింగ్ కూలీ పనికి వెళ్లి పొట్టపోసుకున్న మాట్ల సుభాష్ నేడు సెంట్రింగ్ మేస్త్రి. పీజీ చదువుకొని వరికోత యంత్రం ఆపరేటర్గా కాలం వెళ్లదీసిన మొండెద్దుల నాగరాజు ఇప్పుడు ఓ హార్వెస్టర్కు యజమాని. కలలో కూడా ఊహించని జీవితాలు వారికి ప్రసాదించింది దళితబంధు పథకం. దళితుల జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేసి కూలీలను ఓనర్లుగా మార్చింది.
అప్పుడు అథోగతి.. ఇప్పుడు ప్రగతి
మారిన దళితవాడల బతుకు చిత్రం
లబ్ధిదారుల్లో ఆనందాల హరివిల్లు
ప్రభుత్వ పథకాలు జీవితాలను మారుస్తాయా? ఒక్క పథకంతో దశ తిరిగిపోతుందా?.. తెలంగాణలో కాకుండా మరెక్కడైనా ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. కానీ, మన దగ్గర మాత్రం తడుముకోకుండా టక్కున అవునని చెప్పొచ్చు.
ఒకే ఒక్క పథకం దళితుల జీవితాలను సమూలంగా మార్చేసింది. గౌరవంతో తలెత్తుకునేలా చేసింది. కూటి కోసం, గుడ్డ కోసం శ్రమించిన చోటనే ఇప్పుడు యజమానులై సంతోషంగా జీవిస్తున్నారు.
గాఢాంధకారం నిండిన దళితుల జీవితాల్లో వెలుగురేఖలు విరబూయించిన ఆ పథకం పేరు ‘దళితబంధు’. ఆకలిని అణచిపెట్టుకున్న స్థితి నుంచి వందల కోట్ల రూపాయల జీఎస్టీ చెల్లించేంత ఎత్తుకు ఎదిగేలా చేసిందీ పథకం.
కరీంనగర్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ఏ ఒక్కరో బాగుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నా దళిత జీవితాలు ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. వారి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని, సమాజంలో వారూ తలెత్తుకుని సగర్వంగా జీవించాలన్న ఉదాత్త ఆశయంతో ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన ఆశయం చిగురించి మొగ్గతొడిగింది. ఇప్పుడు దాని ఫలాలను దళితులు అందుకుంటూ చీకూచింతాలేని జీవితాలను గుడపుతున్నారు. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులు రెండేండ్లలోనే పథకం ఫలాలను ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు ఉపాధిలేక చాలీచాలని వేతనాలతో కాలం గడిపిన వారు ఇప్పుడు వ్యాపారవేత్తలుగా, వాహనాలకు యజమానులుగా మారి మరెంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు. వారి జీవితాల్లో చోటుచేసుకున్న ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దళితబంధు పథకంపై సర్వే చేసిన పలు సంస్థలు కూడా దళితుల జీవితాల్లో నిండిన వెలుగులను కండ్లారా చూశాయి. సత్వా, నాబార్డ్, సెంటర్ ఫర్ ఎకానమీ అండ్ సోషలైజేషన్ (సెస్) వంటి సంస్థలు ఇప్పటికే సర్వే నిర్వహించాయి. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 96 శాతం మంది దళితులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నట్టు ఈ సర్వేల్లో వెల్లడైంది. గతంలో కూలికి వెళ్లిన 61 శాతం మంది ఇప్పుడు సొంతవ్యాపారాలు చేసుకుంటున్నారు. పథకంతో వ్యాపారాలుగా మారిన దళితులు ఏకంగా రూ.200 కోట్ల జీఎస్టీని చెల్లించారంటే వారి జీవితంలో దళితబంధు పథకం ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 20 శాతానికి పైగా దళితులు ఐటీ రిటన్స్ దాఖలు చేస్తున్నారు. 44 శాతం మంది అప్పుల జోలికి పోకుండా, తమ కాళ్లపై తాము నిలబడి బతుకుతున్నారు. 88 శాతం మంది సొంతంగా వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నారు. నీతి ఆయోగ్ లాంటి అత్యుత్తమ సంస్థ కూడా దళితబంధు పథకాన్ని పరిశీలించి ఇంత పెద్ద పథకం దేశంలో మరెక్కడాలేదని ప్రశంసలు కురిపించింది. తమిళనాడు నుంచి వచ్చిన ఎమ్మెల్యేల బృందం, మహారాష్ట్ర నుంచి వచ్చిన సర్పంచుల బృందం హుజూరాబాద్లో మారిన దళితుల స్థితిగతులను పరిశీలించి ఆశ్చర్యానికి లోనయ్యాయి. మారిన దళితుల జీవితాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇతని పేరు మాట్ల శ్రీకాంత్. హుజూరాబాద్లోని ఇందిరానగర్. రెండేండ్ల క్రితం వరకు ఓ మెడికల్ షాప్లో పనిచేశాడు. నెలకు వచ్చే రూ.10-12 వేలతో ఇల్లు గడవక సమస్యల్లో కూరుకుపోయాడు. కుటుంబం కోసం అప్పులు చేయాల్సి వచ్చేది. మారోమార్గం లేకపోవడంతో జీవితాన్ని అలాగే నెట్టుకొచ్చాడు.
దళితబంధు పథకంతో అతడి జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. పథకం కింద వచ్చిన రూ.10 లక్షలతో హుజూరాబాద్ ఆర్టీసీ కాంప్లెక్స్లో సొంతంగా ఓ మెడికల్ షాపు పెట్టుకున్నాడు. నెలకు రూ. 30-40 వేలు సంపాదిస్తూ భార్యాపిల్లలతో హాయిగా జీవిస్తున్నాడు. గతంలో చేసిన అప్పులను తీర్చేశాడు. తన షాపులో మరొకరికి ఉపాధి కల్పిస్తున్నాడు.
పై ఫొటోలోని దంపతుల పేర్లు మాతంగి లావణ్య-కుమారస్వామి. వీరిది హుజూరాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి. దళితబంధు పథకానికి ముందు కుమారస్వామి హుజూరాబాద్లో ఒక జ్యూస్ బండి నడుపుకునేవాడు. లావణ్య గ్రామంలోనే చేను పనులకు వెళ్లేది. వేసవిలో మూడునాలుగు నెలలు మాత్రమే జ్యూస్బండికి గిరాకీ ఉండేది. పొద్దంతా కష్టపడినా రోజు గడవడం కష్టంగా ఉండేది. వచ్చే డబ్బు కుటుంబ అవసరాలకు ఏమాత్రం సరిపోయేది కాదు.
సరిగ్గా అదే సమయంలో వచ్చిన దళితబంధు పథకంతో వీరి దశ తిరిగింది. పథకంలో వచ్చిన సొమ్ముతో పేపర్ ప్లేట్లు, గ్లాసులు విక్రయించే ఎంటర్ప్రైజెస్ ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి కష్టపడితే నెలకు రూ.15 వేలు కూడా వచ్చేవి కావు. అలాంటిది ఇప్పుడు వారు దుకాణం పెట్టుకున్న మడిగెకే నెలకు రూ.15 వేల కిరాయి చెల్లిస్తున్నారు. అదనపు ఆదాయం కోసం దుకాణం వద్దనే జ్యూస్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తుండటంతో జీవితం చీకూచింతా లేకుండా సాగిపోతున్నదని లావణ్య-కుమారస్వామి చెప్పుకొచ్చారు.
ఓ సాధారణ పెయింటర్ తాను పెయింటింగ్ షాపునకు యజమాని అవుతానని ఊహించి ఉండడు. హుజూరాబాద్లోని ఇందిరానగర్కు చెందిన కొలుగూరి తిరుపతి జీవితంలో ఇది నిజమైంది. తిరుపతి తండ్రి ఎల్లయ్య కూడా పెయింటరే. ఎమ్మెస్సీ బీఈడీ చదువుకున్న తిరుపతి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తండ్రితో కలిసి పెయింటింగ్ పనికి వెళ్లేవాడు. నెలకు పదిపన్నెండు రోజులు మాత్రమే పని ఉండటంతో రూ.20 వేలకు మించి వచ్చేది కాదు. దీంతో జీవనం కష్టంగా సాగేది.
అయితే, దళిత బంధు తర్వాత వారి జీవితాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. తండ్రీకొడుకు కలిసి రూ.20 లక్షలతో హుజూరాబాద్లో పెయింటింగ్ షాప్ పెట్టారు. ఏషియన్ పెయింట్స్ డీలర్షిప్ తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. 10 నెలల క్రితమే షాపును ప్రారంభించగా, ఇప్పటికే రూ.4లక్షలకు పైగా లాభం ఆర్జించినట్టు తిరుపతి చెప్పాడు. పెయింట్స్ వేసే తాము ఇలా పెయింటింగ్ షాపునకు యజమాని అవుతామని ఊహించలేకపోయామని సంతోషం వ్యక్తం చేశాడు.
ఇతని పేరు పిట్ల శ్రీనివాస్. హుజూరాబాద్లోని బోర్నపల్లి. ఒకప్పుడు మెడికల్ ఏజెన్సీలో నెలకు ఐదారువేల జీతానికి పనిచేసేవాడు. కుటుంబం గడిచేది కష్టంగా ఉండేది. దీంతో కుటుంబ పోషణ కూడా భార్య ప్రవళిక కూడా ఉద్యోగం చేసేది. అయినా వారి జీవితం అంతంత మాత్రంగానే గడిచేది.
ఇలాంటి పరిస్థితుల్లో దళితబంధు పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపింది. పథకం కింద తొలి విడతలో వచ్చిన రూ. 5 లక్షలతో తనకు అనుభవం ఉన్న మెడికల్ ఏజెన్సీని ప్రారంభించాడు. అది దినదిన ప్రవర్థమానంగా ఎదిగి లాభాలు కళ్లజూశాడు. ఏడాదిన్నరలోనే దాదాపు రూ.5 లక్షల లాభం వచ్చింది. ఆ డబ్బును వృథా చేయకుండా ఓ ప్రైవేటు దవాఖానకు అనుబంధంగా మెడికల్షాపు ప్రారంభించాడు. రెండింటినీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నడిపిస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. తమ జీవితాల్లో ఇంతటి మార్పు వస్తుందని తాము ఊహించలేదని, తమ జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్కు రుణపడి ఉంటామని శ్రీనివాస్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
కులాంతర వివాహం చేసుకున్న మోట్కూరి హారిక-అశోక్ దంపతులు అప్పట్లో బతుకుదెరువు కోసం అష్టకష్టాలు పడ్డారు. అశోక్ ఓ ఏజెన్సీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తూ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ విక్రయించేవాడు. అప్పట్లో ఆయనకు నెలకు రూ. 25-30 వేల వేతనం వచ్చేది. సేల్స్ ఆఫీసర్ అన్నట్లేగాని ఫీల్డ్ వర్క్లో విపరీతంగా ఒత్తిడి ఉండేది. ఆరోగ్యం దెబ్బతిన్నా మరోమార్గం లేక ఉద్యోగం మానుకోలేకపోయాడు.
అంతలో దళితబంధు రావడంతో హారిక పేరిట రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం పొందారు. అశోక్ తనకు అనుభవం ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాన్నే ఎంచుకున్నాడు. హుజూరాబాద్లోనే మంచి అడ్డా చూసుకుని అక్కడే ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ డీలర్ షాపును ప్రారంభించారు. అదనంగా సీడ్స్ను కూడా పెట్టుకున్నాడు. ఏజెన్సీ ప్రారంభించిన మొదట్లో అంతగా గిరాకీ ఉండేది కాదు. అశోక్ తనకు ఉన్న పరిచయాలను ఆసరాగా తీసుకుని క్రమంగా వ్యాపారంలో రాణించడం మొదలు పెట్టాడు. ఇపుడు రోజుకు దాదాపు లక్ష రూపాయల వ్యాపారం సాగుతోంది. ఖర్చులు పోను నెలకు రూ. 60-70 వేలు మిగులుతున్నాయని హారిక, అశోక్ చెబుతున్నారు
నాకు ఎకరం వ్యవసాయ భూమి ఉంది. దాంతో కుటుంబం గడవాలంటే కష్టంగా ఉండేది. నేను, నా కొడుకు కిశోర్ రోజూ సెంట్రింగ్ కూలీ పనులకు వెళ్లేది. ఇద్దరి కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేది.
దళితబంధు పథకంలో తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా యూనిట్ అందుకునే అవకాశం నాకు దక్కింది. దళితబంధు పథకంలో సెంట్రింగ్ యూనిట్ పెట్టుకున్నా. కరీంనగర్ జిల్లా చెల్పూరు బహిరంగ సభలో కేసీఆర్ సారు నాకు రూ. పది లక్షల చెక్కు ఇచ్చారు. వచ్చిన డబ్బులతో అధికారులు సెంట్రింగ్ వస్తు సామగ్రి కొనిచ్చారు. అప్పటి నుంచి సెంట్రింగ్ కూలి పనులకు వెళ్లడం మానేసి నేను, నా కొడుకుతోపాటు నలుగురు కూలీలతో పనులు చేస్తున్నా. కమలాపూర్తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో నూతన ఇండ్ల నిర్మాణానికి సెంట్రింగ్ కొడుతున్నా. బిల్డింగ్ను బట్టి రేటు తీసుకుంటున్నా. వచ్చిన డబ్బులతో మరింత సెంట్రింగ్ సామగ్రి కొనుగోలు చేశా. నా కొడుక్కి వచ్చిన ట్రాక్టర్లోనే సెంట్రింగ్ సామగ్రి తరలిస్తున్నా. దళితబంధు పథకం వస్తదని, యజమాని అయితనని ఏనాడూ అనుకోలే. జీవితంలో మర్చిపోలేని మార్పు.
– మాట్ల సుభాష్, దళితబంధు తొలి లబ్ధిదారుడు, కమలాపూర్
నాది ఉప్పల్. నేను పీజీ వరకు చదువుకున్నా. ఆస్తిపాస్తులు లేకపోవడంతో చదువులు, కుటుంబ ఖర్చుల కోసం వరికోత యంత్రం డ్రైవర్గా పనిచేశా. నేను, నా తమ్ముడు నటరాజ్ డ్రైవర్లుగా పనిచేసేవాళ్లం.
దళితబంధు పథకం పెట్టడంతో డ్రైవర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నందున నేను, నా తమ్ముడు ఇద్దరం కలిసి వరికోత యంత్రం పెట్టుకున్నాం. వరికోత యంత్రం రావడంతో డ్రైవర్ అవసరం లేకుండా మేమే ఇద్దరం నడుపుకునేది. వచ్చిన డబ్బులను పోగు చేసుకుని ఏడాది క్రితం వరినాటు వేసే యంత్రం కొనుగోలు చేశాం. గ్రామంలో వ్యవసాయమే జీవనాధారం కావడంతో వరికోతల సమయంలో హార్వెస్టర్ నడిపిస్తాం. కోతలు ముగియగానే వరినాటు వేసే యంత్రం నడిపిస్తాం. దీంతో రెండు సీజన్లలో చేతి నిండా పని ఉంటున్నది. మాతోపాటు డ్రైవర్లను పెట్టుకుని నడిపిస్తున్నాం. డ్రైవర్గా పనిచేసి యజమానులుగా మారడం సంతోషంగా ఉన్నది. ఉపాధిలేక ఇబ్బంది పడే సమయంలో దళితబంధు పథకం మా కుటుంబ జీవనవిధానాన్నే మార్చేసింది.
– మొండెద్దుల నాగరాజు, దళితబంధు లబ్ధిదారుడు ఉప్పల్