ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిన తెలంగాణ
ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యం రెండువేల మెగావాట్లు
మార్చి నెలాఖరుకే 4,959 మెగావాట్ల విద్యుదుత్పత్తి
తొమ్మిది నెలల ముందే రెట్టింపు లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): పునరుత్పాదక విద్యుదుత్పత్తిలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒకవైపు వేసవిలో నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేస్తూనే.. మరోవైపు పునరుత్పాదక విద్యుదుత్పత్తిలోనూ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి రికార్డులు సృష్టిస్తున్నది. ఎంత వినియోగించినప్పటికీ తరిగిపోని వనరులైన సౌరశక్తి, గాలిమరల విద్యుత్తును ‘రెన్యూవబుల్ ఎనర్జీ’గా పరిగణిస్తారు. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేస్తున్న ఎంబర్ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం.. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2022 డిసెంబర్ నాటికి 175 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
అన్ని రాష్ర్టాలు ఆ దిశగా పోటీపడుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా తెలంగాణ ఉత్పత్తి లక్ష్యం రెండువేల మెగావాట్లు కాగా, తొమ్మిదినెలల ముందుగానే ఆ లక్ష్యాన్ని రాష్ట్రం అధిగమించింది. 2022 మార్చి నాటికి తెలంగాణ 4,959 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. ఇది వార్షిక లక్ష్యం కన్నా 249శాతం అధికం. రెట్టింపు ఫలితాలను సాధించిన తెలంగాణ.. దేశంలోని ఇతర రాష్ర్టాలన్నింటికన్నా అగ్రభాగాన నిలిచింది. తర్వాతిస్థానాల్లో కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ (129శాతం), రాజస్థాన్ (119శాతం), కర్ణాటక (107శాతం) నిలిచాయి. దేశంలోని మిగిలిన 27రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో 50శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోకపోవడం గమనార్హం.
వార్షిక విద్యుత్తు డిమాండు వృద్ధిరేటు 4-5 శాతం…
దేశంలో విద్యుత్తు డిమాండు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నది. 2030 నాటికి ఏటేటా 4 నుంచి 5 శాతం సగటు వార్షిక విద్యుత్తు డిమాండ్ పెరుగుతుందని అంచనా. దీనిప్రకారం దేశంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్ డిమాండును అందుకోవాలంటే దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరముంది. పెరుగుతున్న డిమాండును తీర్చడానికి దేశంలో విద్యుత్తు ఉత్పత్తికి కీలకమైన బొగ్గు ఉత్పత్తి, నిల్వలు ప్రస్తుతం సరిపడాలేవు. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ర్టాల్లో విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలవారీగా లక్ష్యాలను నిర్దేశించింది. ‘తెలంగాణ లక్ష్యం కన్నా 249శాతం అధికంగా విద్యుదుత్పత్తిని సాధించి, ఇతర రాష్ర్టాల కన్నా ముందంజలో ఉంది. గడువుకన్నా తొమ్మిదినెలల ముందే మార్చినెలాఖరుకే తెలంగాణ ఈ ఘనతను సాధించింది’ అని ఎంబర్ తన నివేదికలో వెల్లడించింది. భవిష్యత్తు డిమాండ్కు తగినట్లుగా విద్యుదుత్పత్తి చేయగలిగిన సామర్థ్యం తెలంగాణకు ఉందని స్పష్టమవుతున్నది.
అదనపు ఉత్పత్తి దిశగా …
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో లక్ష్యాలను అధిగమించడంతోపాటు అదనపు ఉత్పత్తిపైనా తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం 4.5గిగా వాట్లుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 గిగావాట్లకు పెంచుకునేందుకు విద్యుత్ సంస్థలు, తెలంగాణ రెడ్కో చర్యలు చేపట్టాయి. మొత్తం ఉత్పత్తిలో 33 శాతం పునరుత్పాదక విద్యుత్తు ఉండేలా చూడాలన్న నిబంధనలకు అనుగుణంగా టీఎస్ రెడ్కో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నది. ముఖ్యంగా శ్రీనిధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ఇండ్లల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుండడం మంచి ఫలితాలను ఇస్తున్నదని టీఎస్ రెడ్కో అధికారులు తెలిపారు.