ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకొన్నామో.. ఆ లక్ష్యం దిశగా తెలంగాణ అతి వేగంగా అడుగులు వేస్తున్నది. ఎవరిపైనా ఆధారపడకుండానే.. స్వయం సమృద్ధి సాధించే దిశగా కదులుతున్నది. సంక్షేమం.. అభివృద్ధి రాష్ట్రం నలుదిక్కులకూ వికేంద్రీకృతమైంది. నగర ఆర్థిక వ్యవస్థతోపాటు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకూడా పరిపుష్టం అయ్యే దిశగా పుంజుకొన్నది. ఒక్క ఏడాదిలో జీఎస్డీపీ పెరుగుదల 14.7 శాతం సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రెండేండ్ల నుంచి కరోనా కాటేస్తున్నా.. కేంద్రం ఏకాణా ఇయ్యకున్నా తన సత్తా చాటుకొన్నది.
హైదరాబాద్, మార్చి 1 : తెలంగాణ రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. అభివృద్ధిలో తనకు తానే సాటి అని మళ్లీ నిరూపించుకున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014-15 నుంచి రాకెట్ వేగంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ సగర్వంగా అగ్రస్థానంలో నిలిచింది. స్వయంగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంవోఎస్పీఐ) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న రాష్ర్టాల సమాచారం ఆధారంగా నివేదిక విడుదల చేసింది. ఇది తెలంగాణ ఆర్థిక ప్రగతికి, కరోనా విపత్తును సైతం రాష్ట్రం సమర్థంగా ఎదుర్కొన్నదని చెప్పడానికి తిరుగులేని సాక్ష్యంగా నిలిచింది. స్థిర ధరల వద్ద.. 2021-22లో జీఎస్డీపీ వృద్ధిరేటు 14.7 శాతంతో పరుగులు పెట్టి దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. తలసరి ఆదాయంలో సైతం 18.8 శాతం వృద్ధితో అగ్రస్థానాన్ని సంపాదించింది. ఐదేండ్ల తలసరి ఆదాయం సగటు వృద్ధిరేటులోనూ మిగతా రాష్ర్టాలకు అందనంత ఎత్తులో నిలిచింది. సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు, టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు గణాంకాల శాఖ నివేదిక గీటురాయిగా మారింది.
గోడకు కొట్టిన బంతిలా.. జీఎస్డీపీ వృద్ధి
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర జీఎస్డీపీ విలువ స్థిరంగా పెరుగుతూనే ఉన్నది. వృద్ధిరేటులో రెండో సంవత్సరానికే జాతీయ సగటును అధిగమించిన తెలంగాణ.. ఆ తర్వాత వ్యత్యాసాన్ని పెంచుకొంటూ పోతున్నది. కరోనా విపత్తు సమయంలోనూ జాతీయ సగటును మించి వృద్ధిని నమోదు చేసింది. కరోనా ప్రభావంతో 2019-20, 2020-21లో జీఎస్డీపీ వృద్ధిరేటు కాస్త మందగించినా.. ఈ ఆర్థిక సంవత్సరంలో గోడకు కొట్టిన బంతిలా రెట్టింపు వేగంతో పెరిగింది. సరికొత్త రికార్డు నెలకొల్పింది. స్థిర ధరల (2011-12) వద్ద 2020-21 ఆర్థిక సంంత్సరంలో -3.5 శాతం వృద్ధి నమోదవగా.. 2021-22లో 11.2 శాతానికి పెరిగింది. అంటే.. ఏడాదిలోనే ఏకంగా 14.7 శాతం అధిక వృద్ధిని సాధించింది. ఇది తెలంగాణ చరిత్రలోనే ఆల్టైమ్ రికార్డు.
రెండు లక్షల కోట్లు పెరిగిన జీఎస్డీపీ విలువ
ప్రస్తుత ధరల వద్ద 2021-22లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.11,54,860 కోట్లకు పెరిగింది. 19.10 శాతం వృద్ధిని సాధించింది. తద్వారా దేశంలోనే రెండోస్థానం సంపాదించింది. మధ్యప్రదేశ్ 19.74 శాతంతో మొదటిస్థానంలో ఉన్నది.
2020-21తో పోల్చితే రాష్ట్ర జీఎస్డీపీ విలువ ఒకే ఏడాదిలో ఏకంగా రూ.1,91,204 కోట్లు పెరగటం తెలంగాణ చరిత్రలోనే ఒక రికార్డు.
రూ.2.78 లక్షలకు తలసరి ఆదాయం
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, సంస్కరణల ఫలితంగా తెలంగాణ తలసరి ఆదాయం 2014-15 నుంచి ఏటికేడు పెరుగుతూనే ఉన్నది. కరోనా విపత్తులోనూ వెనుకంజ వేయలేదు. 2021-22లో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78, 833 గా నమోదైంది. అదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,49,848గా నమోదైంది.
సగటు వృద్ధిలోనూ అగ్రపథమే..
ఐదేండ్లలో (2017-18 నుంచి 20221-22 మధ్య) తలసరి ఆదాయం సగటు వృద్ధి (సీఏజీఆర్)ని పరిశీలిస్తే జాతీయ సగటు (6.8 శాతం) కన్నా తెలంగాణ (11.7 శాతం) 4.9 శాతం అధికంగా వృద్ధి నమోదు చేసింది.
అందుబాటులో ఉన్న 10 రాష్ర్టాల జీఎస్డీపీ వృద్ధిరేటు వివరాలను పరిశీలిస్తే తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. స్థిర ధరల వద్ద 2021-22లో తెలంగాణ వృద్ధిరేటు 11.2 శాతంగా ఉండగా… మధ్యప్రదేశ్, ఒడిశా 10.1 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
కేంద్రం సహకరించకున్నా అగ్రస్థానమే
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ), తలసరి ఆదాయంలో తెలంగాణ గణనీయమైన వృద్ధి రేటు సాధించింది. కేంద్ర సహకారం లేకపోయినా విభజన సమస్యలను అధిగమించి రాష్ట్రం ముందుకు సాగుతున్నదనడానికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం. 2014 నుంచి 2021 వరకు రాష్ట్ర తలసరి ఆదాయం 125%, జీఎస్డీపీలో 130% పెరిగింది. దేశంలోనే అత్యంత తక్కువ వయసు కలిగిన రాష్ట్రం సాధించిన అభివృద్ధి ఇది.
– కే తారకరామారావు, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి
కుట్రలు అధిగమించి అద్భుతాలు
జీఎస్డీపీలో తెలంగాణ 19.46% నమోదుచేయగా, తలసరి ఆదాయంలో దేశంలోనే అత్యధికంగా 19.10% వృద్ధి రేటును నమోదు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం గణాంకాలు విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమని ప్రశంసించింది. సీఎం కేసీఆర్ పాలనలో ఒకవైపు రాజకీయ కుట్రలను ఎదుర్కొంటూనే తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తున్నది. దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర తాజా గణాంకాలు చూస్తే అర్థం అవుతున్నది. తలసరి ఆదాయ వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ), తలసరి ఆదాయంలో రికార్డుస్థాయి వృద్ధిరేటు నమోదుచేసింది.
– తన్నీరు హరీశ్రావు, ఆర్థిక మంత్రి
సమర్థపాలనకు సాధించిన ప్రగతే నిదర్శనం
రెండేండ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నా అభివృద్ధి పథంలో రాష్ట్రం పరుగులు పెడుతూనే ఉన్నదని కేంద్ర ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిరంతరం ప్రజల కోసం పనిచేసే సీఎం కేసీఆర్ సమర్థమైన పరిపాలనకు తాజా గణాంకాలే నిదర్శనం స్వరాష్ట్రం సాధించిన అనతికాలంలోనే దేశం గర్వించేస్థాయిలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. జీఎస్డీపీ, తలసరి ఆదాయం ఈ రెండు ప్రగతి సూచికలని, వీటిలో తెలంగాణ మేటిగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే చెప్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో, ప్రజల జీవన ప్రమాణస్థాయి పెంపులో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది.
– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
జీఎస్టీ వసూళ్లలోనూ సూపర్
బీజేపీ పాలిత రాష్ర్టాలను మించిన తెలంగాణ
జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ ముందువరుసలో నిలిచింది. గత ఏడాది ఫిబ్రవరి కంటే ఈ ఫిబ్రవరిలో 13% వృద్ధిని కనబరిచింది. ఈ వృద్ధి బీజేపీ పాలిత రాష్ర్టాలకంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఫిబ్రవరి (2022) మాసాంతానికి వసూలైన జీఎస్టీ గణాంకాలను కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం విడుదలచేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణలో వసూలు అయిన జీఎస్టీ రూ.3,636 కోట్లు కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వసూలు అయిన జీఎస్టీ రూ.4,113 కోట్లుగా ఆర్థికశాఖ పేర్కొన్నది. తెలంగాణ కంటే బీజేపీ పాలితరాష్ర్టాలు జీఎస్టీ వసూళ్లలో బాగా వెనుకబడ్డాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 9 శాతం వృద్ధి కనబరచగా, గుజరాత్ 8 శాతం మాత్రమే జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల సాధించింది. హర్యానా 6 శాతం నమోదుచేయగా మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల వృద్ధిరేటు కేవలం 2 శాతమే కావడం గమనార్హం.