న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఇంటింటికీ నల్లా నీరు, ఉచిత విద్యుత్తు, తలసరి ఆదాయం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ సూచికల్లో ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ.. ప్రజలకు న్యాయసేవలను చేరువ చేయడంలోనూ ముందంజలో ఉన్నది. దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్-2022 పేరిట టాటా ట్రస్ట్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
న్యాయవ్యవస్థలో ఖాళీలు, బడ్జెట్ కేటాయింపులు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, చట్టబద్ధమైన పరిహారం, జైళ్ల పరిస్థితి, పోలీసులు, మానవ హక్కుల కమిషన్ల పనితీరుపై సమాచారం సేకరించి ఈ నివేదికను రూపొందించారు. జాబితాలో కర్ణాటక, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. నాలుగో స్థానంలో గుజరాత్ ఉండగా, ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. టాప్-5లో నాలుగు దక్షిణాది రాష్ర్టాలే కావడం విశేషం. ఢిల్లీ, చండీగఢ్ మినహా దేశంలోని ఏ రాష్ట్రం, ఏ కేంద్ర పాలిత ప్రాంతం కూడా న్యాయవ్యవస్థ కోసం వార్షిక బడ్జెట్లో 1 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేయటం లేదు.