హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): పౌరులకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని, నిస్వార్థంగా చేస్తున్న కృషిని పలు నివేదికలు, సర్వే సంస్థలు కొనియాడుతున్నాయి. పటిష్టమైన పోలీసు వ్యవస్థతోపాటుగా సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో పలు నేరాల్లోని నిందితులను త్వరగా గుర్తించే వీలు దొరుకుతున్నది. ఇదే విషయాన్ని ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్టు -2023’ ‘లోక్నీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ వంటివి తమ సర్వే నివేదికల్లో ప్రస్తావించాయి.
ఫేషియల్ టెక్నాలజీలో అగ్రస్థానం
రాష్ట్రంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ పోలీసులు ‘ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ’ (ఎఫ్ఆర్టీ)ని వినియోగిస్తున్నది. ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్టు-2023’ ప్రకారం నాలుగు ఎఫ్ఆర్టీ వ్యవస్థలను ఉపయోగించి, సీసీ కెమెరాలను యాక్సెస్ చేసే విషయంలో తెలంగాణ పోలీసు వ్యవస్థ అగ్రస్థానంలో నిలిచింది. మూడు ఎఫ్ఆర్టీ వ్యవస్థలతో తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉండగా.. రెండు ఎఫ్ఆర్టీలతో మహారాష్ట్ర, తమిళనాడు నిలిచాయి. తెలంగాణ సోషియో ఎకనామిక్స్ సర్వే (జనవరి 2023) ప్రకారం తెలంగాణవ్యాప్తంగా 10.14 లక్షల సీసీ కెమెరాలు యాక్టివ్గా ఉన్నాయి.
ప్రతి స్టేషన్కు 257 సీసీటీవీల యాక్సెస్
2016 నుంచి 2020 వరకు తెలంగాణలోని ప్రతి పోలీస్స్టేషన్కు సగటున 257 సీసీటీవీ ఫుటేజ్లను యాక్సెస్ చేసే వెలుసుబాటు ఉన్నది. దీంతో నేరం జరిగినప్పుడు పోలీసు విచారణ మరింత సులువుగా మారింది. అన్నిచోట్లా నిఘా ఎక్కువగా ఉండటంతో హత్యలరేటు కూడా తగ్గిపోయినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రతి వెయ్యిమందికి సీసీటీవీ కెమెరాలను పెంచి, భద్రత కల్పించిన నగరాల్లో ఇండోర్, హైదరాబాద్ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ వ్యాప్తంగా 2022లో కొత్తగా 1,74,205 సీసీ కెమెరాలు అమర్చినట్టు పోలీసు నివేదిక చెప్తుంది.