హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): వైద్యరంగంలో గత ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివిధ సూచీలలో తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టింది. ప్రసూతి మరణాలు, శిశు, నవజాత శిశు మరణాలు, ఐదేండ్లలోపు చిన్నారుల మరణాలను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. పేదరికం, రవాణా, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, కాన్పుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో గతంలో అనేకమంది తల్లులు మరణించేవారు. 2014-15లో తెలంగాణలో ప్రతి లక్ష జననాలకు ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) 92 ఉండేది. అది 2020-21 నాటికి 63కు తగ్గింది. ఈ స్థాయిలో ప్రసూతి మరణాల రేటును తగ్గించడం తెలంగాణకే సాధ్యమైంది. 2016-18తో పోల్చితే ఏకంగా 13 పాయింట్లు తగ్గుముఖం పట్టగా, దేశంలోనే అత్యధికంగా 17.1శాతం తగ్గుదల నమోదైంది. జాతీయ సగటు ఎంఎంఆర్ ప్రస్తుతం 113గా ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది.
ఇతర సూచీల్లోనూ అదే మార్పు
తెలంగాణలో శిశు మరణాల రేటు 2014-15లో 39 ఉండగా, 2020-21 నాటికి 26.4కు తగ్గింది. ఐదేండ్ల్ల లోపు చిన్నారుల మరణాల రేటు 41 నుంచి 29.4కు తగ్గింది. నవజాత శిశు మరణాల రేటు 25 నుంచి 16.8 శాతానికి దిగొచ్చింది. సంస్థాగత కాన్పులు నాడు 91 ఉంటే ఇప్పుడు 97కు పెరిగాయి. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు నాడు 30 శాతంగా ఉంటే ఇప్పుడు 97కు చేరుకున్నది. ఇలా అన్ని సూచీలు తెలంగాణ వైద్య రంగం సాధించిన అభివృద్ధికి అద్దం పడుతున్నాయి.
ఫలించిన రాష్ట్ర పథకాలు
రాష్ట్ర పభుత్వం తల్లీబిడ్డల సంరక్షణకు పెద్దపీట వేస్తున్నది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఐదు మెటర్నల్ ఐసీయూలను నెలకొల్పింది. ప్రభుత్వ దవాఖానల్లో కా న్పులు పెంచేందుకు లేబర్రూమ్లు, మహిళలకు వైద్య సదుపాయాలు కల్పించడం, 102 అమ్మ ఒడి వాహనాలు వంటి కార్యక్రమాలు చేపట్టింది. బాల్య వివాహాలు నివారణ, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల పెంపు లక్ష్యంగా 2017లో చేపట్టిన కేసీఆర్ కిట్ల పంపిణీ పథకం ఎంఎంఆర్ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషించింది. బాబు పుడితే రూ.12 వేలు, పాప పుడితే రూ.13 వేలను అందజేస్తున్నది. వీటికి అదనంగా రూ.2 వేలు విలువ చేసే వస్తువులతో కేసీఆర్ కిట్ అందజేస్తున్నది. దేశంలోనే మొదటిసారిగా మిడ్ వైఫరీ వ్యవస్థను ప్రవేశపెట్టి సాధారణ కాన్పులను ప్రోత్సహిస్తున్నది. చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నది. జిల్లా దవాఖానల్లో నవజాత శిశువుల కోసం ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేస్తున్నది. న్యూబార్న్ కేర్ సెంటర్లను 22 నుంచి 42కు పెంచుతున్నది. 9 దవాఖానల్లో మాతాశిశు సంరక్షణ ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసింది.