హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నాయకుల బృందం గురువారం కేంద్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి రాఘవేంద్రసింగ్, పర్యాటకశాఖ కార్యదర్శి అర్వింద్ సింగ్, ఆర్కియాలజీ డీజీ విద్యావతితో సమావేశమైంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీలు బండా ప్రకాశ్, వెంకటేశ్ నేత, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నగరాల్లో మ్యూజియంలు ఏర్పాటు చేయాలని వారు వినతిపత్రం సమర్పించారు. గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షో వేదికను వేరేచోటుకి మార్చాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కల్చరల్ ఆడిటోరియం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఠాగూర్ కల్చరల్ కాంప్లెక్స్ పథకం కింద రాష్ట్రంలోని సాంస్కృతిక సముదాయాల అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించింది. తెలంగాణలోని చారిత్రిక కట్టడాలు, కోటల అభివృద్ధి పనులు చేపట్టాలని, ఈ మేరకు పంపిన ప్రతిపాదనలను పరిశీలించాలని కోరింది. కరీంనగర్ మ్యూజియం పునరుద్ధరణకు సాయం అందించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ అంగీకరించిన విషయాన్ని గుర్తుచేస్తూ, సవరించిన డీపీఆర్లను ఆమోదానికి పంపించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణకు సాంస్కృతికంగా పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఢిల్లీలో మంత్రులు గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున తాము చేసిన ప్రతిపాదనలపై సానుకూల స్పందన వచ్చిందన్నారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. రామప్ప దేవాలయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో ప్యారిస్లో నిర్వహించే యునెస్కో సమావేశంలో ఎలాగైనా రామప్పకు గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం కూడా ఇందుకోసం కృషి చేస్తున్నదని చెప్పారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి గిరిధర్తో భేటీ అయ్యారు. మహబూబ్నగర్ నుంచి జడ్చెర్ల వరకు నిర్మిస్తున్న నాలుగు లేన్ల జాతీయ రహదారి ప్రాజెక్టులో 8 కిలోమీటర్ల నిర్మాణ పనులను జిల్లా పరిపాలన శాఖకు బదిలీ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అలాగే పర్యాటక శాఖ కార్యదర్శి అర్వింద్సింగ్తో భేటీ అయ్యి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆరాధ్య దైవం మన్యంకొండ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50.1 కోట్ల ఆర్థిక సాయం అందించాలని, భద్రాచల ఆలయ అప్గ్రెడేషన్కు రూ.50 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, తెలంగాణ పర్యాటక, టూరిజం శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్రాజ్, ఇతర అధికారులు మంత్రి వెంట ఉన్నారు.