Tigers | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ)/మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన రెండు పులుల మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పశు కళేబరంపై విషంచల్లిన అనంతరం నిందితులు (అనుమానితులు) పులి రాకకోసం అక్కడే ఎదురుచూసినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో వారు సెల్ఫోన్లో మూడు పులులు మాంసాన్ని తింటున్న వీడియోలను చిత్రీకరించినట్టు తెలిసింది. ఈ ఘటనలో రెండు పులులు మృత్యువాత పడగా, విషాహారాన్ని తిన్న మూడో పులి చనిపోయిందా? బతికే ఉన్నదా? అన్న మిస్టరీని ఛేదించాల్సి ఉన్నది. కుమ్రంభీం జిల్లా కాగజ్నగర్ అటవీ కారిడార్లో పులుల మృతి ఘటనను అటవీశాఖ సీరియస్గా తీసుకున్నది. విషప్రయోగం చేసినవారిగా అనుమానిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయగా, అసలు విషయాలు వెలుగుచూశాయని ప్రచారం జరుగుతున్నది. బుధవారం అర్ధరాత్రి ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని వాంకిడి మండలం సర్కేపల్లి గ్రామానికి చెందిన నలుగురిని, కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని దరిగాం గ్రామానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సర్కేపల్లికి చెందిన నలుగురిలో ఇద్దరు విషప్రయోగం చేసినట్టు తెలిసింది. ఆ ఇద్దరు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు మైనర్లను తమ వెంట తీసుకెళ్లినట్టు సమాచారం. వారితోపాటు దరిగాం గ్రామానికి చెందిన మరో ఇద్దరు సైతం వారికి సహకరించినట్టు తెలుస్తున్నది. గురువారం ఉదయం ఆ ఆరుగురిని విషప్రయోగం చేసిన పశు కళేబరం ఉంచిన ప్రాంతానికి, పులులు మృతిచెందిన ప్రాంతాలకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అధికారులు తీసుకువెళ్లారు.
కాగజ్నగర్, జనవరి 11: దరిగాం గ్రామ అటవీ ప్రాంతంలో రెండు పులుల మృతి ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. షర్కపల్లి, రింగరీట్, దరిగాం గ్రామాలకు చెందిన ఆరుగురు అనుమానితులను బుధవారం అదుపులోకి తీసుకొని కాగజ్నగర్ డివిజన్ కార్యాలయానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమ పిల్లలను కలువనివ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. జడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి ఆధ్వర్యంలో గురువారం రాత్రి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు తమ అదుపులో ఉన్నవారిని కలిసేందుకు అనుమతించారు. వారిలో ఇద్దరు మైనర్ బాలురను బయటకు పంపారు. వారు మీడియాతో మాట్లాడుతూ తమను ఇష్టారాజ్యంగా కొట్టారని, దీంతో భయపడి వేలిముద్రలు వేశామని తెలిపారు. అదుపులో ఉన్నవారందరినీ బట్టలు విప్పి కొట్టారంటూ మైనర్ బాలుడొకరు చెప్పారు.
విషప్రయోగంలో మృతి చెందిన ఎస్-9 (మగపులి)తోపాటు ఎస్-6 ఆడపులి, వాటి పిల్లలైన నాలుగు పిల్లలు కాగజ్నగర్ డివిజన్లోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నాయి. వీటిలో ఎస్-9 మగపులి, దానితోనే కలిసి తిరిగే పులిపిల్ల ఎస్-15 చనిపోయాయి. ఆడపులి అయిన ఎస్-6, దాని పిల్లలైన మరో మూడు పులుల జాడ కోసం అడవి మొత్తం జల్లెడ పడుతున్నారు. బుధవారం 70 మంది 15 బృందాలుగా విడిపోయి పులులను ట్రాక్ చేశారు. గురువారం మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, కాగజ్నగర్, సిర్పూర్ డివిజన్ల నుంచి వచ్చిన 120 మంది 13 బృందాలుగా విడిపోయి అడవి మొత్తం జల్లెడపట్టారు. సర్కేపల్లి గ్రామం చుట్టూ విస్తరించి ఉన్న గుట్టలను ఈ బృందాలు ముమ్మరంగా గాలించాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్-6 (ఆడ పులి)తోపాటు దాని రెండు పిల్లల పాదముద్రలను వారు గుర్తించారు. రెండు పులులు మృతిచెందిన ప్రాంతానికి పక్కనే ఉన్న ఊట్పల్లి గ్రామంలో ఓ లేగ దూడను పులులు వేటాడినట్టు కూడా తెలిసింది.
మొత్తం ఆరు పులుల్లో రెండు చనిపోగా, మిగిలిన నాలుగింటిలో మూడింటి పాదముద్రలను అధికారులు గురువారం గుర్తించారు. తండ్రి పులి(ఎస్-9)తో తిరిగే రెండు కూనల్లో ఎస్-15 చనిపోగా, రెండోది చాలారోజుల క్రితమే విడిపోయి వేరుగా సంచరిస్తున్నట్టు చెప్తున్నారు. కానీ విషప్రయోగం చేసిన పశుమాంసాన్ని మూడు పులులు తిన్నట్టు తెలుస్తున్నది. ఆ మూడింటిలో ఒకటి ఎస్-9, రెండోది ఎస్-15 చనిపోగా, మూడోది ఏమైందన్నది తేలాల్సి ఉన్నది. విషప్రయోగం చేసిన మాంసం తిన్నది ఇంకా ఆచూకీ తెలియని పులేనా? లేక తల్లితో ఉన్నట్టు చెప్తున్న రెండు పులుల్లో ఒకటా, లేదా చాలారోజుల క్రితం వేరుగా విడిపోయి సంచరిస్తున్న పులినా అన్నది తేలాల్సి ఉన్నది.