హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటామని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ సాయిచంద్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఉన్న రాష్ర్ట మహిళా అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్గా ఆకుల లలిత పదవీబాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితతో కలిసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతిరాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, కూచుకుళ్ల దామోదరరెడ్డి, గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ను విస్తరించేందుకు కృషిచేస్తానని ఆకుల లలిత చెప్పారు. అటు.. గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా సాయిచంద్ నాంపల్లిలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎస్డబ్ల్యూసీ ఎండీ జితేందర్రెడ్డి హాజరయ్యారు. సాయిచంద్ మాట్లాడుతూ.. ‘ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు, నాపై పెట్టిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహిస్తా’ అని పేర్కొన్నారు.