హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పర్యాటక యవనికపై తెలంగాణ తన ప్రత్యేకతను చాటుతున్నదని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. లండన్లో సోమవారం నుంచి బుధవారం వరకు జరిగే వరల్డ్ టూరిజం మార్ట్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ స్టాల్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 125 దేశాల ప్రతినిధులు దీనికి హాజరవ్వగా.. భారత్ నుంచి 15 రాష్ట్రాలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ ప్రదర్శనలో తెలంగాణ పర్యాటకరంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని పేర్కొన్నారు.
గతంలో విశ్వవేదికలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసే స్టాల్లో తెలంగాణ కూడా పాల్పంచుకునేదని, కానీ తొలిసారిగా మన పర్యాటక స్టాల్ను ప్రత్యేకంగా ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలిపారు. లండన్ వరల్డ్ టూరిజం మార్ట్ (డబ్ల్యూటీఎం) ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి అకడి నుంచి తన సందేశాన్ని అందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్యాటక రంగాన్ని సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని మంత్రి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు మంగళవారం లండన్ వీధుల్లో తెలంగాణ పర్యాటక బృందం ప్రత్యేకంగా రోడ్ షో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.