హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతమైంది. కొత్త పెట్టుబడులతోపాటు భవిష్యత్ పెట్టుబడులకూ తెలంగాణను గమ్యస్థానంగా మార్చడంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలను ఆయన సద్వినియోగం చేసుకొన్నారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణం, సమర్థ నాయకత్వం, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే ప్రభుత్వ విధానాల ఫలితంగా నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల వరద పారేలా కృషిచేశారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శనం, మంత్రి కేటీఆర్ నాయకత్వ ప్రతిభ, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిరంతర సమన్వయం, అలుపెరగని కృషితో దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో తెలంగాణ పేరు మార్మోగింది. కేటీఆర్ నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్లో ఈ నెల 16 నుంచి 20 వరకు అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ కంపెనీ అగ్రనాయకత్వాలతో 52 సమావేశాలు.. ఆరు రౌండ్ టేబుల్ మీటింగ్స్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక వేత్తలతో రెండు చర్చా గోష్టులు నిర్వహించింది.
ఆకట్టుకున్న తెలంగాణ పెవిలియన్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ఈ సారి కూడా దావోస్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు, వివిధ దేశాల వ్యాపార, వాణిజ్య సంస్థల అధినేతలు, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగం పంచుకొనే మేధావులు, ఆర్థిక నిపుణులు ఈ పెవిలియన్ను సందర్శించారు. తెలంగాణ భౌగోళిక స్వరూపంతోపాటు 8 ఏండ్లలో వివిధ రంగాల్లో సాధించిన పెట్టుబడులు, పారిశ్రామిక, ఐటీ దాని అనుబంధ రంగాల్లో చేపట్టిన టీ హబ్, టీ వర్స్ కార్యక్రమాల సమాచారాన్ని ఆసక్తిగా తెలుసుకొన్నారు. కాళేశ్వరం భారీ ప్రాజెక్టు, ఇతర మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ విధానాలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను వీక్షించారు. దావోస్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే పెట్టబడుల వేట మొదలుపెట్టిన తెలంగాణ బృందం.. అనుకొన్న లక్ష్యాన్ని సాధించింది. ఐదోసారి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు హాజరైన మంత్రి కేటీఆర్..ఎప్పటిలాగే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించారు.
లక్ష్యాన్ని చేరుకొన్నాం: మంత్రి కేటీఆర్
అద్భుతమైన పారిశ్రామిక విధానాలతోపాటు మౌలిక వసతులున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపైన పరిచయం చేసేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలు సరైనవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సారి సమావేశాల్లోనూ తమ లక్ష్యాన్ని చేరుకొన్నామని చెప్పారు. నాలుగు రోజుల ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు దాదాపు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించి వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. దావోస్ పర్యటనలో తనకు అడుగడుగునా తోడుగా ఉన్న తన బృందంలోని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రమోషన్, ఎన్నారై వ్యవహారాల స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్రెడ్డి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఆటోమోటివ్స్ డైరెక్టర్ గోపాలకృష్ణన్, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంను ప్రత్యేకంగా అభినందించారు.
కంపెనీలు, పెట్టుబడుల వివరాలు
1 హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. రూ.16 వేల కోట్లతో మరో మూడు డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
2 రూ.150 కోట్లతో రాష్ట్రంలో గ్లోబల్ క్యాపబిలిటీస్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు వెబ్ పీటీ సంస్థ ప్రకటించింది. ఔట్ పేషెంట్ రిహాబిలిటేషన్ థెరపీలో రో గులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డి జిటల్ సేవలను అందించడంలో ఈ సం స్థకు అంతర్జాతీయంగా మంచి పేరుంది.
3 హైదరాబాద్లో అత్యాధునిక క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్టు యూరోఫిన్స్ ప్రకటించింది. భారతీయ ఔషధ మారెట్లో విస్తరించేందుకు ఈ క్యాంపస్ను నెలకొల్పనున్నట్టు ఫ్రాన్స్కు చెందిన ఈ కంపెనీ తెలిపింది. ఈ సంస్థ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నది.
4 హైదరాబాద్లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు అపోలో టైర్స్ ముందుకొచ్చింది. ఈ సంస్థ డిజిటల్ ట్విన్స్, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలపై దృష్టి పెట్టింది. లండన్ తర్వాత హైదరాబాద్లోనే అపోలో టైర్స్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నది.
5 రూ.2 వేల కోట్లతో తెలంగాణలో హైపర్ సేల్ డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు భారతీ ఎయిర్టెల్ గ్రూప్ ప్రకటించింది.
6 తెలంగాణలో అల్లాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.750 కోట్లతో మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని ద్వారా 600 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
7 తెలంగాణలో కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్టు పెప్సికో ప్రకటించింది. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్టు వెల్లడించింది. తమ ఉద్యోగుల సంఖ్యను 2,800 నుంచి 4 వేలకు పైగా పెంచుతున్నట్టు ప్రకటించింది.
8 నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభిస్తామని ప్రపంచ ఆర్థిక వేదిక పేర్కొన్నది. హెల్త్ కేర్, లైఫ్ సెన్సెస్ రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టే ఈ కేంద్రం ఏర్పాటు దేశంలోనే మొదటిది కావడం విశేషం.